సేలం: కావేరీ జలాల వివాదంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులకు ఎలాంటి అవగాహన లేదా వివరాలు తెలియవని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కే. పళనిసామి తీవ్రంగా విమర్శించారు. శాసనసభ ఎన్నికల వాగ్దానాన్ని నెరవేరుస్తూ, తన సొంత నిధులతో సమకూర్చిన రెండు ఉచిత అంబులెన్స్ సేవలను శనివారం సేలంలోని నెడుంచాలై నగర్ నివాసం వద్ద ఎడప్పాడి పళనిసామి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు కీలక విషయాలపై మాట్లాడారు:
రైతులను పట్టించుకోని ప్రభుత్వం కావేరీ నదీ జలాల పంపిణీపై అధికార పార్టీకి కనీస పరిజ్ఞానం లేదన్నారు.. ఫలితంగా తమిళనాడుకు రావలసిన నెలవారీ నీటి వాటాను కూడా దక్కించుకోలేకపోతున్నారని తెలిపారు. దీనివల్ల డెల్టా జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారున్నారన్నారు. కర్ణాటక జలాశయాల్లో సరిపడా నీరు ఉన్నప్పటికీ తమిళనాడు ప్రభుత్వం చొరవ తీసుకోలేదని మండిపడ్డారు. ఈ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు విమర్శించారు.
పాలన పేరుతో రీల్స్ డ్రామాలు
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి కొత్త సంక్షేమ పథకాలను అమలు చేయలేదు. పాత పథకాలకే పేర్లు మార్చి ప్రచారం చేసుకుంటున్నారన్నారు. తమిళనాడులో ప్రస్తుతం రీల్స్ చేసుకోవడం, ఉత్తుత్తి కబుర్లు చెప్పే పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. సాగు రుణాలను పూర్తిగా మాఫీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు రైతులు సహా అన్ని వర్గాల ప్రజలను ముఖ్యమంత్రి దారుణంగా మోసం చేశారని మండిపడ్డారు. ఒకప్పుడు ఎంతో గౌరవప్రదంగా ఉన్న శాసనసభ నేడు సినిమా షూటింగ్ సెట్లా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.


