సారవకోట: మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది. ఒక పక్క చెరువుల్లో తవ్వకాలు సాగిస్తూ మట్టిని ట్రాక్టర్లలో తరలిస్తూ సొమ్ము చేసుకుంటుండగా మరో పక్క ఎలాంటి అనుమతులు లేకుండా కొండలు తవ్వి కంకర అమ్ముకుంటున్నారు. మట్టి మాఫియా, జేసీబీ యజమానులు మండలంలోని వంశధార గట్టును సైతం తవ్వి ఆ మట్టిని అమ్ముకుంటున్నారు. ఇటీవల గుమ్మపాడు పంచాయతీ అక్కివలస సమీపంలో వంశధార ఎడమ కాలువకు గండి పడి కొన్ని వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోయింది. దీంతో అధికారులు స్పందించి ఆ గండిని పూడ్చా రు. అలాంటి పరిస్థితిలో ఉన్న వంశధార ఎడమ కాలువ గట్టును మండలంలోని చీడిపూడి సమీపంలో యంత్రాలతో తవ్వి మట్టిని అమ్ముకుంటున్నారు. చీడిపూడి ఎత్తిపోతల పథకం సమీపంలో గత మూడు రోజుల పాటు యంత్రాలు పెట్టి ట్రాక్టర్లతో ఇష్టానుసారంగా మట్టిని తవ్వుకు పోయారు. మట్టి తరలింపును అడ్డుకోవాల్సిన వంశధార నీటి పారుదల శాఖాధికారులు గట్టును పరిశీలించిన దాఖలాలే లేకపోవడం గమనార్హం.
చీడిపూడి గ్రామంలో వంశధార గట్టు ఒక పక్క ఆక్రమణలకు గురవుతున్నా, అక్కడున్న మట్టి తవ్వుకుని పోతున్నా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో మట్టి మాఫియా ఇష్టానుసారంగా మట్టి తర లించుకుని వంశధార కాలువ గట్టు బలహీనం చేస్తున్నారు. దీనిపై వంశధార నీటి పారుదల శాఖ డీఈ సరస్వతిని వివరణ కోరగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. గట్టు తవ్వినట్లు కనిపిస్తే సంబంధిత యంత్రాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.


