పలాస: పలాస పారిశ్రామిక వాడలో గల జీడి పరిశ్రమలను మూకుమ్మడిగా బంద్ చేస్తున్నా రు. ఈ మేరకు పలాస పారిశ్రామిక వాడ జీడి పప్పు ఉత్పత్తిదారుల సంక్షేమ సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సంఘం సమావేశం ఆ సంఘం అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి వ్యాపారస్తులు అందరూ హాజరై తమ వ్యాపారాలు సక్రమంగా జరగడం లేదని, మార్కెట్లో జీడి పప్పునకు, జీడి పిక్కలకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విధానం కొనసాగితే తమ వ్యాపారాలు నష్టాల బాట పడతాయని ఆవేదన వ్యక్తం చేయడంతో సంఘం బంద్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రామేశ్వరరావు మాట్లాడుతూ ఈ నెల 24 నుంచి 10 రోజులు పాటు బంద్ చేస్తున్నట్టు ప్రకటించారు. తిరిగి ఆగస్టు 3న పరిశ్రమలు తెరుస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాయిలింగ్ నిలుపుదల చేయాలని కోరారు. సమావేశంలో సంఘం కార్యదర్శి తూముల శ్రీనివాసరావు, కోశాధికారి కొంచాడ వినయ్, తాళాసు ణశ్రీనివాసరావు, తాళాసు నర్సింహమూర్తి, నాగభూషణ్, కాళీప్రసాద్, జామి రాము, కొత్తకోట తిరుమల, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు .
వజ్రపుకొత్తూరు: నువ్వలరేవు గ్రామానికి చెందిన మత్స్యకారుడు బైనపల్లి బొన్న( 40) కర్ణాటకలోని మలిపి తీరం జెట్టీలో ఈ నెల 17న వేట చేస్తుండగా ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుని భార్య జానకి, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు బైనపల్లి బొన్న ఈ నెల 17న మలిపి తీరంలో జెట్టీ నుంచి చేపల వేటకు బయలుదేరాడు. బయల్దేరిన కాసేపటికే బోటుపై నుంచి ప్రమాదవశాత్తు కాలు జారి కింద పడి గల్లంతయ్యాడు. తోటి మత్స్యకారులు బొన్న కోసం గాలించినా ఫలితం లేకపోయింది. చివరికి 19వ తేదీన అదే తీరంలో మృతదేహం కొట్టుకురావడంతో గుర్తించిన స్థానిక మత్స్యకారుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మృతుని భార్య జానకి, కుమార్తె ఉమ కన్నీరు మున్నీరై విలపించారు. మృతదేహం బాగా కుళ్లిన స్థితిలో ఉండడంతో స్వగ్రామానికి తీసుకు రాలేని పరిస్థితి ఎదురైంది. దీంతో కుటుంబ సభ్యులు కర్ణాటక వెళ్లి ఖననం చేశారు. విషయం తెలుసుకున్న మత్స్య శాఖ ఫీల్డ్ ఆఫీసర్ కొండ నాగరాజు, సాగరమిత్ర కిరణ్కుమార్తో కలిసి నువ్వలరేవు గ్రామానికి చేరుకుని మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.


