టెక్కలి రూరల్: వేడి నూనె మీద పడి ఐదేళ్ల చిన్నారి హరిప్రియత్ మంగళవారం రాత్రి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. టెక్కలిలోని వంశధార కాలనీకి చెందిన షణ్ముఖ తన భార్య, కుమారుడితో కలసి సోమవారం రాత్రి సమీప ఒడిశాలోని పర్లాఖిమిడి రథయాత్రకు వెళ్లారు. అక్కడ యాత్రలో తిరుగుతూ సమీపంలోని ఒక ఫాస్ట్పుడ్ సెంటర్ వద్ద కూర్చుని ఉండగా.. బాలుడు మరుగుతున్న నూనె కడాయిని ఒక్కసారిగా పొరపాటున లాగేయడంతో వేడి నూనె అంతా బాలుడి మీద పడిపోయింది. వెంటనే అతడిని సమీప ఆస్పత్రిలో చూపించి అక్కడి నుంచి వైజా గ్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. బాలుడు అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మృతుడి తండ్రి ఇంజినీరింగ్ కార్యాలయంలో పనిచేస్తున్నాడు.
● నేలబారు వ్యవస్థకు నిదర్శనం
ఈ వ్యక్తి నడవలేకపోతున్నారు. వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చారు. ఆయన వైద్యుడిని కలవడం.. సమస్య చెప్పుకోవడం.. మందులు రాయించుకోవడం తర్వాత. ఆస్పత్రికి వచ్చిన వ్యక్తికి కనీసం ఓ వీల్చైర్ ఏర్పాటు చేయకపోవడం.. దీనంగా నేలపై పాకుతూ వెళ్తున్నా పట్టించుకోకపోవడం ఎంతటి దయనీయం. టెక్కలి జిల్లా ఆస్పత్రిలో ఇదే ఘటన జరిగింది. ఆయన నడవలేని స్థితిలో ఆస్పత్రికి వచ్చి ఓపీ విభాగం నుంచి వైద్యుడి వద్దకు నేలపై పాకుతూ అటు ఇటు తిరుగుతున్నప్పటికీ వీల్ చైర్ సేవలు అందజేయాల్సిన సిబ్బంది కనీసం పట్టించుకోలేదు. ఆస్పత్రి దుస్థితిని తెలపడానికి ఇంతకు మించిన నిదర్శనం ఏముంటుంది. – టెక్కలి


