
గుజరాత్ టైటాన్స్ పేసర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj)పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ప్రశంసలు కురిపించాడు. జాతీయ జట్టుకు దూరమైన కసి అతడి ఆటలో కనిపిస్తోందని.. త్వరలోనే అతడు టీమిండియాలో పునరాగమనం చేస్తాడని పేర్కొన్నాడు. కాగా హైదరాబాదీ పేసర్ చివరగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ తరఫున ఆడాడు.
ఆ తర్వాత స్వదేశంలో ఇంగ్లండ్తో టీ20, వన్డే సిరీస్లకు సెలక్టర్లు అతడిని ఎంపిక చేయలేదు. అనంతరం.. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)జట్టులోనూ చోటివ్వలేదు. ఈ క్రమంలో తీవ్ర నిరాశకు గురైన సిరాజ్.. జట్టు ప్రయోజనాల దృష్ట్యానే సెలక్టర్లు, కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) తనను పక్కనపెట్టి ఉంటారని పేర్కొన్నాడు.
ఆర్సీబీ వదిలేసింది
అయితే, జాతీయ జట్టుకు దూరం కావడం వల్ల దొరికిన విశ్రాంతిని పొడగించకుండా.. ఫిట్నెస్పై దృష్టి సారిస్తానని సిరాజ్ చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2025కి ముందు ఈ పేస్ బౌలర్కు ఎదురుదెబ్బ తగిలిన విషయం తెలిసిందే. ఏడేళ్ల పాటు తమతో ప్రయాణం చేసిన సిరాజ్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు వదిలేసింది.
టైటాన్స్ అక్కున చేర్చుకుంది
ఈ క్రమంలో గుజరాత్ టైటాన్స్ రూ. 12.25 కోట్లకు సిరాజ్ను కొనుగోలు చేసింది. ఇక ఐపీఎల్-2025లో తమ ఆరంభ మ్యాచ్లలో అంతంత మాత్రంగా రాణించిన సిరాజ్.. తన పాత జట్టు ఆర్సీబీపై మాత్రం అదరగొట్టాడు. ఆర్సీబీ సొంత మైదానం చిన్నస్వామి స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో కీలక వికెట్లు తీసి.. ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు.
నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 19 పరుగులే ఇచ్చి మూడు వికెట్లు కూల్చాడు. ఫిల్ సాల్ట్, దేవదత్ పడిక్కల్, లియామ్ లివింగ్ స్టోన్ల వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా.. గుజరాత్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు సిరాజ్.
నేనేంటో చూపిస్తా!.. అతడిలో ఆ కసి కనిపించింది
ఈ నేపథ్యంలో భారత మాజీ వీరేంద్ర సెహ్వాగ్ మాట్లాడుతూ.. ‘‘చాంపియన్స్ ట్రోఫీ జట్టుకు అతడిని ఎంపిక చేయలేదు. అతడిలో ఆ కసి కనిపించింది. యువ ఫాస్ట్ బౌలర్ నుంచి మనం ఇంతకంటే గొప్పగా ఏమి ఆశిస్తాం. అతడు తిరిగి గాడిలో పడ్డాడు.
అంతేకాదు.. ‘మీరు నన్ను తీసుకోలేదు కదా!.. నేనేంటో ఇప్పుడు చూపిస్తాను’ అన్నట్లుగా చెలరేగిపోయాడు. ఇదే తరహాలో సిరాజ్ ముందుకు దూసుకవెళితే కచ్చితంగా భారత జట్టులో త్వరలోనే పునరాగమనం చేస్తాడు.
కొత్త బంతితో చిన్నస్వామి స్టేడియంలో అద్భుతంగా రాణించాడు. తన మొదటి మూడు ఓవర్లలో కేవలం 12 లేదా 13 పరుగులు మాత్రమే ఇవ్వడం ఇందుకు నిదర్శనం. అయితే, నాలుగో ఓవర్లో మాత్రం కాస్త తడబడ్డాడు. లేదంటే.. ఇంకో వికెట్ అతడి ఖాతాలో చేరేదే. కొత్త బంతిని స్వింగ్ చేస్తూ అనుకున్న ఫలితాన్ని రాబట్టడం సానుకూలాంశం’’ అని హిందుస్తాన్ టైమ్స్తో పేర్కొన్నాడు.
కాగా చాంపియన్స్ ట్రోఫీ జట్టు ప్రకటన సమయంలో సిరాజ్ గురించి ప్రశ్న ఎదురుకాగా.. ‘‘అతడు కొత్త బంతితో మెరుగ్గా రాణించలేడు. అందుకే పక్కనపెట్టాం’’ అని కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సెహ్వాగ్ సిరాజ్ను ఉద్దేశించి పైవిధంగా స్పందించాడు.
ఐపీఎల్-2025: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
ఆర్సీబీ స్కోరు: 169/8 (20)
గుజరాత్ టైటాన్స్ స్కోరు: 170/2 (17.5)
ఫలితం: ఆర్సీబీపై ఎనిమిది వికెట్ల తేడాతో గుజరాత్ విజయం
చదవండి: అందుకే ఓడిపోయాం: కోహ్లి, సాల్ట్లపై పాటిదార్ విమర్శలు!