Wrestlers Morphed Photo: Wrestlers Denained That Photos Morphed During Arrest Of Vinesh Phogat - Sakshi
Sakshi News home page

Wrestlers Protest: 'అది మేము కాదు.. మా ఫోటోలను మార్ఫింగ్‌ చేశారు!'

May 29 2023 5:32 PM | Updated on May 29 2023 6:07 PM

Wrestlers Denained That Photos Morphed During Arrest Of Vinesh Phogat - Sakshi

డబ్ల్యూఎఫ్‌ఐ చీఫ్‌, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా టాప్‌ రెజ్లర్లు నెల రోజులుగా ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిరసన తెలుపుతున్న విషయం తెలిసిందే. చాన్నాళ్లుగా నిరసన వ్యక్తం చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి కదలిక లేకపోవడంతో రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వైపు శాంతియుత ర్యాలీ చేపట్టారు.

శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీకి వెళ్తున్న రెజ్లర్లను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సాక్షి మాలిక్‌, వినేశ్‌ ఫోగట్, భజరంగ్‌ పునియాతో పాటు ఇతర ఆందోళనకారులను నిర్బంధించి పోలీస్‌ స్టేషన్లకు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు.

కాగా, రెజ్లర్లను బలవంతంగా అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారిని బస్సుల్లో ఎక్కించి వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి. ఫొటోల్లో వినేశ్‌ ఫోగట్‌, సంగీత ఫోగట్‌ పోలీసు వ్యాన్‌లో కూర్చుని నవ్వుతూ సెల్ఫీ తీసుకుంటున్నట్లు ఉంది. ఈ ఫొటోలపై రెజ్లర్లు స్పందించారు. తమ ఫొటోలను కొందరు మార్ఫింగ్‌ చేసి సోషల్‌ మీడియాలో వైరల్‌ చేశారని ఆరోపించారు.

''కొత్తగా వచ్చిన ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌(AI Technology) ఉపయోగించి మొహాలనే మార్చేస్తున్నారు.. మేమెంత చెప్పండి.. మా నిరసనపై బురద జల్లే ప్రయత్నంలో  కొందరు గిట్టని వ్యక్తులు ఇలాంటి తప్పుడు చిత్రాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈ నకిలీ ఫొటోను పోస్ట్‌ చేసిన వారిపై ఫిర్యాదు చేస్తాం'' అని భజరంగ్‌ పునియా ట్వీట్‌ చేశాడు.

దీనిపై సాక్షి మలిక్‌ స్పందిస్తూ..''అవి నిజమైన ఫొటోలు కావు. కొందరు కావాలనే మార్ఫింగ్‌ చేశారు. అలాంటి వారికి సిగ్గు లేదు. వారిని దేవుడు ఎలా సృష్టించాడో అర్థం కావట్లేదు. మాకు చెడ్డపేరు తీసుకొచ్చేందుకే ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు'' అని మండిపడ్డారు.

చదవండి: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం

Advertisement
 
Advertisement
Advertisement