పొట్టి క్రికెట్ మహా సంగ్రామానికి సమయం ఆసన్నమైంది. ఇంగ్లండ్ వేదికగా జూన్ 12- జూలై 5 మధ్య ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-2026 టోర్నీకి షెడ్యూల్ ఖరారైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లండ్- శ్రీలంక మధ్య శుక్రవారం ఈ మెగా ఈవెంట్కు తెరలేవనుంది.
ఇక భారత మహిళా జట్టు తమ తొలి మ్యాచ్లోనే దాయాది పాకిస్తాన్ను ఎదుర్కోనుంది. ఎడ్జ్బాస్టన్లో ఆదివారం (జూన్ 14) ఇరుజట్లు ముఖాముఖి తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పాక్తో తలపడే భారత తుదిజట్టుపై తన అంచనా తెలియజేశాడు.
‘‘ఓపెనర్గా షఫాలీ వర్మనే సరైన ఆప్షన్. ఆమెకు తోడుగా వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ఉండనే ఉంది. యస్తికా భాటియా కూడా అద్భుతంగా ఆడుతోంది. మూడో స్థానంలో ఆమెను ఆడించాలి. నాలుగో స్థానంలో జెమీమా రోడ్రిగ్స్, ఐదో స్థానంలో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ ఆడుతుంది.
రిచా ఘోష్ ఆరో స్థానంలో పవర్ హిట్టర్గా సేవలు అందించగలదు. భారతి పుల్మాలిని ఎంపిక చేయాలనే ఉంది. కానీ రాధా యాదవ్తో పోలిస్తే ఆమె కాస్త వెనుబడి ఉన్నట్లు అనిపిస్తోంది. కాబట్టి ఫినిషర్గా రాణించగల లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధా యాదవ్నే నేను ఎంచుకుంటాను.
ఆ తర్వాతి స్థానంలో దీప్తి శర్మ ఉంటుంది. క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రీచరణి బౌలింగ్ విభాగంలో సేవలు అందిస్తారు’’ అని అభిషేక్ నాయర్ స్టార్ స్పోర్ట్స్ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు.
పాకిస్తాన్తో మ్యాచ్కు అభిషేక్ నాయర్ ఎంచుకున్న భారత తుదిజట్టు
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, యస్తికా భాటియా, జెమీమా రోడ్రిగ్స్, హర్మన్ప్రీత్ కౌర్, రిచా ఘోష్, రాధా యాదవ్, దీప్తి శర్మ, అరుంధతి రెడ్డి, శ్రీచరణి, క్రాంతి గౌడ్.


