చరిత్ర సృష్టించిన టామ్‌ లాథమ్ | Tom Latham Creates History Becomes The First Overseas Captain To Win A Test Series In England And India In This Century | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన టామ్‌ లాథమ్

Jun 30 2026 10:29 AM | Updated on Jun 30 2026 11:04 AM

Tom Latham becomes the first overseas Captain to win a Test series in England and India in this century

తాజాగా ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపై టెస్ట్‌ సిరీస్‌లో ఓడించిన (2-1) న్యూజిలాండ్‌ జట్టు చరిత్రలో నిలిచిపోయే ఎన్నో రికార్డులు సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌ గెలుపు ఆ జట్టు కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌కు కూడా ప్రత్యేక కీర్తి తెచ్చి పెట్టింది.

ఈ సిరీస్‌లో న్యూజిలాండ్‌ తొలి టెస్ట్‌ ఓడిపోయిన తర్వాత అనూహ్యంగా పుంజుకొని ఆతర్వాత రెండు టెస్ట్‌లు గెలిచింది. తొలి టెస్ట్‌ కోల్పోయి, ఆతర్వాత సిరీస్‌ గెలవడం న్యూజిలాండ్‌కు ఇదే మొదటిసారి.

ఈ గెలుపు న్యూజిలాండ్‌ కెప్టెన్‌ టామ్‌ లాథమ్‌కు మరో ఘనత కూడా తెచ్చిపెట్టింది. ఈ శతాబ్దంలోనే (21వ) ఇంగ్లండ్‌ సహా భారత్‌ను వారి సొంత ఇలాకాల్లో ఓడించిన మొదటి విదేశీ కెప్టెన్‌గా టామ్‌ చరిత్ర సృష్టించాడు. ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన ఆరో కెప్టెన్‌గా నిలిచాడు.

టామ్‌ 2024లో భారత్‌ను 3-0 తేడాతో క్లీన్‌ స్వీప్‌ చేసి చరిత్రపుటల్లో నిలిచాడు. టీమిండియాను వారి సొంతగడ్డపై 3 మ్యాచ్‌ల సిరీస్‌లో వైట్‌ వాష్‌ చేయడం ఏ విదేశీ కెప్టెన్‌కైనా ఇదే తొలిసారి.

అలాగే 1999 తర్వాత ఇంగ్లండ్‌లో మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఉన్న టెస్ట్‌ సిరీస్‌ను గెలవడం కూడా న్యూజిలాండ్‌కు ఇదే మొదటిసారి.

వాస్తవానికి ఈ సిరీస్‌ విజయం న్యూజిలాండ్‌కు అంత సులభంగా ఏమీ దక్కలేదు. తొలి టెస్ట్‌ ఓటమి తర్వాత స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ రిటైర్డ్‌ కాగా.. సిరీస్‌ డిసైడర్‌ అయిన మూడో టెస్ట్‌కు కీలక బౌలర్లు మ్యాట్‌ హెన్రీ, కైల్‌ జేమీసన్‌ అందుబాటులో లేరు.

ఇంగ్లండ్‌పై సిరీస్‌ గెలుపుతో న్యూజిలాండ్‌కు మరో సానుకూల అంశం కూడా తెలిసొచ్చింది. ఈ గెలుపుతో ఆ జట్టు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టినలో మూడో స్థానానికి దూసుకొచ్చింది.

ట్రెంట్‌ బ్రిడ్జ్‌ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్‌ 373 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఇంగ్లండ్‌ తడబడి 212 పరుగులకే ఆలౌటై, 160 పరుగుల తేడాతో పరాజయంపాలైంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement