Photo Credit: Cricket West Indies Twitter
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో వెస్టిండీస్ తన పరువును కాపాడుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్ను కివీస్కు అప్పగించిన వెస్టిండీస్ బుధవారం జరిగిన చివరి వన్డేలో మాత్రం 2 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 269 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన వెస్టిండీస్ 47.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
విండీస్ సీనియర్ బ్యాటర్ షిమ్రోన్ హెట్మైర్ (69 నాటౌట్) కడదాకా నిలిచి విజయంలో కీలకపాత్ర పోషించగా, షెర్ఫెన్ రూథర్ఫోర్డ్ (61) అర్ధసెంచరీతో మెరిశాడు. ఈ ఇద్దరు కలిసి ఐదో వికెట్కు 95 పరుగులు జోడించి జట్టును విజయం దిశగా నడిపించారు. రూథర్ఫోర్డ్ ఔటయ్యాకా మళ్లీ వరుసగా వికెట్లు కోల్పోయినప్పటికీ హెట్మైర్ అజేయంగా నిలిచి విండీస్ను గెలిపించాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో జాకబ్ డఫీ, జేడన్ లెన్నోక్స్ చెరో మూడు వికెట్లు తీయగా, నాథన్ స్మిత్, మైకెల్ బ్రాస్వెల్ చెరొక వికెట్ పడగొట్టారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. టామ్ లాథమ్ (69), నిక్ కెల్లీ (64), విల్ యంగ్ (56) అర్ధసెంచరీలు సాధించారు.
విండీస్ బౌలర్లలో విటెల్ లాయిస్, అల్జారీ జోసెఫ్ చెరో 2 వికెట్లు తీశారు. విండీస్ను గెలిపించిన హెట్మైర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకోగా, సిరీస్లో 14 వికెట్లతో అదరగొట్టిన కివీస్ బౌలర్ జేడన్ లెనోక్స్ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు సొంతం చేసుకున్నాడు.
చదవండి: అతడి విషయంలో బీసీసీఐ ఆందోళన.. జట్టు ప్రకటన వాయిదా!


