ప్రధాని మోదీని కలవనున్న విశ్వ విజేతలు.. అనంతరం ముంబై వీధుల్లో విజయోత్సవ యాత్ర | T20 World Cup 2024: Road Show In Mumbai After Audience With PM In Delhi For Victorious Indian Team | Sakshi
Sakshi News home page

Team India Road Show In Mumbai: ప్రధాని మోదీని కలవనున్న విశ్వ విజేతలు.. అనంతరం ముంబై వీధుల్లో విజయోత్సవ యాత్ర

Jul 4 2024 7:29 AM | Updated on Jul 4 2024 9:55 AM

T20 World Cup 2024: Road Show In Mumbai After Audience With PM In Delhi For Victorious Indian Team

యూఎస్‌ఏ, కరీబియన్‌ దీవులు వేదికగా జరిగిన టీ20 వరల్డ్‌కప్‌ 2024లో టీమిండియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. జూన్‌ 29న జరిగిన ఫైనల్లో భారత్‌.. సౌతాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయం సాధించి, రెండో టీ20 వరల్డ్‌కప్‌ను ఖాతాలో వేసుకుంది. ఈ గెలుపుతో టీమిండియా 11 ఏళ్ల కలను (ఐసీసీ ట్రోఫీ) సాకారం చేసుకుంది. భారత్ చివరిసారిగా 2013లో ఐసీసీ ట్రోఫీని (ఛాంపియన్స్‌ ట్రోఫీ) సాధించింది.

కాగా, వరల్డ్‌కప్‌ విజయానంతరం భారత బృందం ఫైనల్‌ మ్యాచ్‌కు వేదిక అయిన బార్బడోస్‌లోనే చిక్కుకుపోయింది. బార్బడోస్‌లో హరికేన్‌ (గాలివాన) బీభత్సం కారణంగా  టీమిండియా రెండు రోజుల పాటు అక్కడే ఉండిపోయింది. హరికేన్‌ ప్రభావం కారణంగా బార్బడోస్‌ విమానాశ్రయం మూసివేయడంతో టీమిండియా స్వదేశానికి చేరడం ఆలస్యమైంది.

ఎట్టకేలకు 100 మందితో కూడిన భారత బృందం ఇవాళ (జులై 4) తెల్లవారుజామున న్యూఢిల్లీలో ల్యాండ్‌ అయ్యింది. ఎయిర్‌ ఇండియా ప్రత్యేక విమానం​ టీమిండియాను ఢిల్లీకి చేర్చింది.

మోదీని కలువనున్న భారత బృందం
భారత బృందం ఇవాళ ఉదయం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని కలువనుంది. ఈ సందర్భంగా మోదీ టీమిండియాను అభినందిస్తారు. మోదీ రెండు బ్యాచ్‌లుగా భారత బృందాన్ని కలుస్తారు. తొలుత ఆటగాళ్లు, ఆతర్వాత సపోర్టింగ్‌ స్టాఫ్‌ మోదీతో ములాఖాత్‌ అవుతారు. ఉదయం 9:30 గంటల​ ప్రాంతంలో భారత బృందం మోదీని కలిసే అవకాశం ఉంది.

ముంబై వీధుల్లో విజయోత్సవ యాత్ర
అనంతరం టీమిండియా ‍ప్రత్యేక విమానంలో ముంబైకు బయల్దేరుతుంది. సాయంత్రం ముంబై నగర వీధుల్లో టీమిండియా విజయోత్సవ యాత్ర జరుగనుంది. అనంతరం  వాంఖడే స్టేడియంలో టీమిండియాకు సన్మాన కార్యక్రమం ఉంటుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement