ఇంగ్లండ్‌తో తొలి టీ20.. చ‌రిత్ర‌కు అడుగు దూరంలో సూర్య‌ | Suryakumar Aims Huge Milestone In England T20Is | Sakshi
Sakshi News home page

IND vs ENG: ఇంగ్లండ్‌తో తొలి టీ20.. చ‌రిత్ర‌కు అడుగు దూరంలో సూర్య‌

Jan 21 2025 3:05 PM | Updated on Jan 21 2025 3:28 PM

Suryakumar Aims Huge Milestone In England T20Is

స్వదేశంలో ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడేందుకు సూర్యకుమార్ యాదవ్(Suryakumar Yadav) సారథ్యంలోని భారత జట్టు సిద్దమైంది. ఈ సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య తొలి టీ20 బుధవారం(జనవరి 22) ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ కోసం ఇప్ప‌టికే కోల్‌క‌తాకు చేరుకున్న  ఇంగ్లండ్‌, భార‌త జ‌ట్లు నెట్స్‌లో తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి.

ఇక తొలి టీ20కు ముందు టీమిండియా కెప్టెన్ సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. ఈ మ్యాచ్‌లో సూర్య‌కుమార్ సెంచ‌రీ సాధిస్తే.. ఇంగ్లండ్‌పై టీ20ల్లో రెండు శ‌త‌కాలు న‌మోదు చేసిన తొలి బ్యాట‌ర్‌గా రికార్డుల‌కెక్కుతాడు. ఇంగ్లండ్‌పై సూర్య ఇప్ప‌టికే ఓ టీ20 సెంచ‌రీని న‌మోదు చేశాడు.

సూర్య‌తో పాటు భార‌త వ‌న్డే కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌, పాకిస్తాన్ స్టార్ ప్లేయ‌ర్ బాబ‌ర్ ఆజం సైతం ఇంగ్లండ్‌పై త‌లా ఓ టీ20 సెంచ‌రీని బాదాడు. ఇప్పుడు కోల్‌క‌తా టీ20లో మిస్ట‌ర్ 360 సెంచ‌రీతో మెరిస్తే ఈ ఇద్ద‌రి దిగ్గ‌జ క్రికెట‌ర్ల‌ను అధిగ‌మిస్తాడు. ఒకవేళ తొలి టీ20లో వీలు కాకపోయినా, సిరీస్‌ మధ్యలోనైనా ఈ రికార్డు బద్దులు అయ్యే అవకాశముంది.

అదేవిధంగా అంతర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆసీస్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మాక్స్‌వెల్, రోహిత్ శ‌ర్మ రికార్డును స‌మం చేస్తాడు. మాక్సీ, రోహిత్ ఇద్ద‌రూ ఇప్ప‌టివ‌ర‌కు 5 టీ20 సెంచ‌రీలు న‌మోదు చేశారు. సూర్య‌కుమార్ ఖాతాలో ప్ర‌స్తుతం 4 అంత‌ర్జాతీయ టీ20 సెంచ‌రీలు ఉన్నాయి.

కాగా గ‌త కొన్నేళ్ల నుంచి  సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో భారత బ్యాటింగ్ యూనిట్‌కు వెన్నెముకగా నిలుస్తున్నాడు. ఇప్ప‌టివ‌రర‌కు 78 మ్యాచ్‌లు ఆడిన ఈ ముంబైక‌ర్‌.. 40.8 సగటుతో 2570 పరుగులు చేశాడు.

అత‌డి కెరీర్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 4 టీ20 సెంచ‌రీలు ఉన్నాయి. అయితే గ‌తేడాది ఆఖ‌రిలో సౌతాఫ్రికాతో జ‌రిగిన సిరీస్‌లో మాత్రం సూర్య‌కుమార్ నిరాశ‌ప‌రిచాడు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో కేవ‌లం 8.67 స‌గ‌టుతో కేవ‌లం 26 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇప్పుడు ఇంగ్లండ్ సిరీస్‌తో త‌న రిథ‌మ్‌ను తిరిగి పొందాల‌ని సూర్య భావిస్తున్నాడు.

కాగా భార‌త్‌తో తొలి టీ20 కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు త‌మ ప్లేయింగ్ ఎలెవ‌న్‌ను ప్ర‌క‌టించింది. నలుగురు పేస్ బౌల‌ర్ల‌తో ఇంగ్లండ్ బ‌రిలోకి దిగ‌నుంది. అదేవిధంగా ఈ జ‌ట్టులో యువ సంచ‌ల‌నం జాకబ్ బెథెల్‌కు చోటు ద‌క్కింది.

ఇంగ్లండ్ తుది జ‌ట్టు: బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ (వికెట్ కీప‌ర్‌), జోస్ బట్లర్ (కెప్ట‌తెన్‌), హ్యారీ బ్రూక్ (వైస్ కెప్టెన్‌), లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, జామీ ఓవర్‌టన్, జోఫ్రా ఆర్చర్, గస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్
ఇంగ్లండ్‌తో తొలి టీ20కి భారత తుదిజట్టు(అంచనా)
సంజూ శాంసన్‌, అభిషేక్‌ శర్మ, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌(కెప్టెన్‌), హార్దిక్‌ పాండ్యా, రింకూ సింగ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌, మహ్మద్‌ షమీ, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి.
బెంచ్‌: వాషింగ్టన్‌ సుందర్‌, ధ్రువ్‌ జురెల్‌, హర్షిత్‌ రాణా, రవి బిష్ణోయి.

చదవండి: ఇంగ్లండ్‌ వైస్‌ కెప్టెన్‌గా యువ క్రికెటర్‌.. ప్రకటించిన ఈసీబీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement