ఏప్రిల్‌, మే నెలల్లో ట్రై సిరీస్‌ ఆడనున్న భారత్‌ | Sri Lanka To Host India, South Africa For ODI Tri Series | Sakshi
Sakshi News home page

ఏప్రిల్‌, మే నెలల్లో ట్రై సిరీస్‌ ఆడనున్న భారత్‌

Mar 6 2025 7:32 PM | Updated on Mar 6 2025 8:18 PM

Sri Lanka To Host India, South Africa For ODI Tri Series

ఈ ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో శ్రీలంకలో మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో శ్రీలంక సహా భారత్‌, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ డబుల్‌ రౌండ్‌ రాబిన్‌ ఫార్మాట్‌లో జరుగుతుంది. ప్రతి జట్టు నాలుగు గ్రూప్‌ స్టేజీ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్‌ మ్యాచ్‌ల అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు కొలొంబోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. 

మ్యాచ్‌లన్నీ డే మ్యాచ్‌లుగా జరుగుతాయి. ఏప్రిల్‌ 27న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టీమిండియాతో తలపడనుంది. మే 11న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే మూడు జట్లు ఇదివరకే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.

ముక్కోణపు సిరీస్‌ షెడ్యూల్‌
ఏప్రిల్‌ 27- భారత్‌ వర్సెస్‌ శ్రీలంక
ఏప్రిల్‌ 29- భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా
మే 1- శ్రీలంక వర్సెస్‌ సౌతాఫ్రికా
మే 4- భారత్‌ వర్సెస్‌ శ్రీలంక
మే 6- భారత్‌ వర్సెస్‌ సౌతాఫ్రికా
మే 8- సౌతాఫ్రికా వర్సెస్‌ శ్రీలంక
మే 11- ఫైనల్‌

కాగా, భారత్‌ ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఐర్లాండ్‌తో వన్డే సిరీస్‌ ఆడింది. ఈ సిరీస్‌లో భారత్‌ జయకేతనం ఎగురవేసింది. గతేడాది చివర్లో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ కోసం ఇంగ్లండ్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. శ్రీలంక విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం​ న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.

మహిళల క్రికెట్‌ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్‌లో డబ్ల్యూపీఎల్‌ మూడో సీజన్‌ జరుగుతుంది. ఈ లీగ్‌ చివరి దశకు చేరింది. 15 మ్యాచ్‌లు అయిపోయే సరికి ఢిల్లీ క్యాపిటల్స్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది. 

గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్‌ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్‌ ముంబై ఇండియన్స్‌ మూడులో, ఢిపెండింగ్‌ చాంపియన్‌ ఆర్సీబీ నాలుగో స్థానంలో, యూపీ వారియర్జ్‌ ఐదో స్థానంలో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్‌, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. ‌

Advertisement
 
Advertisement
Advertisement