నాకు అప్ప‌గించిన ప‌ని పూర్తి చేశా.. ఇక‌: శ్రేయ‌స్ అయ్య‌ర్‌ | Shreyas Iyer Breaks Silence On Snub For India Vs Afghanistan T20I Series, See What He Commented On This - Sakshi
Sakshi News home page

Shreyas Iyer: బాధ లేదు.. నాకు అప్ప‌గించిన ప‌ని పూర్తి చేశా.. ఇక‌

Jan 15 2024 9:02 PM | Updated on Jan 16 2024 2:08 PM

Something That: Shreyas Iyer Breaks Silence On Snub For Afg T20I Series - Sakshi

అఫ్గ‌నిస్తాన్‌తో టీ20 సిరీస్ ఆడుతున్న టీమిండియాలో చోటు ద‌క్క‌క‌పోవ‌డంపై మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్ స్పందించాడు. త‌న ఆధీనంలో లేని విష‌యాల గురించి ప‌ట్టించుకోన‌ని.. త‌న‌కు ఇచ్చిన బాధ్య‌త‌ను స‌క్ర‌మంగా నిర్వ‌ర్తించ‌డంపై మాత్ర‌మే శ్ర‌ద్ధ పెడ‌తాన‌ని తెలిపాడు. ప్ర‌స్తుతం త‌ను అదే ప‌నిలో ఉన్నాన‌ని పేర్కొన్నాడు. 

యువ బ్యాట‌ర్ల‌కు అవ‌కాశం
సౌతాఫ్రికా ప‌ర్య‌ట‌న‌లో స్థాయికి త‌గ్గ‌ట్లు రాణించ‌లేక చ‌తికిల‌పడ్డ శ్రేయ‌స్ అయ్య‌ర్‌ను అఫ్గ‌న్‌తో స్వ‌దేశంలో టీ20 సిరీస్‌కు ఎంపిక చేయ‌లేదు బీసీసీఐ సెల‌క్ట‌ర్లు. శుబ్‌మ‌న్ గిల్‌, య‌శ‌స్వి జైస్వాల్‌, తిల‌క్ వ‌ర్మ‌, రింకూ సింగ్ వంటి యువ బ్యాట‌ర్ల‌కు అవ‌కాశం ఇచ్చారు. 

అదే విధంగా.. స్టార్ ఆల్‌రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా గైర్హాజ‌రీలో శివం దూబేకు దాదాపు నాలుగేళ్ల త‌ర్వాత పిలుపునిచ్చారు. వీళ్లంతా వ‌చ్చిన అవ‌కాశాల‌ను సద్వినియోగం చేసుకుని సిరీస్ 2-0తో గెల‌వ‌డంలో త‌మ వంతు పాత్ర పోషించారు. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌-2024 బెర్తుల‌ను ఖాయం చేసుకునే ప‌నిలో ప‌డ్డారు.

ఇలా వీరంతా టీ20 సిరీస్‌తో బిజీగా ఉంటే.. శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు మాత్రం దేశ‌వాళీ క్రికెట్ ఆడాల‌నే ఆదేశాలు వెళ్లాయి. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌న‌కు స‌న్న‌ద్ధం కావాల్సిందిగా మేనేజ్‌మెంట్ సూచించింది.
 
రంజీ ట్రోఫీ-2024 బ‌రిలో
అందుకు త‌గ్గ‌ట్లుగానే ముంబై త‌ర‌ఫున రంజీ ట్రోఫీ-2024 బ‌రిలో దిగాడు. ఆంధ్ర‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 48 ప‌రుగుల‌తో ఆక‌ట్టుకున్న అయ్య‌ర్‌.. 145కు పైగా ఓవ‌ర్ల‌పాటు ఫీల్డింగ్ చేశాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఆంధ్ర జ‌ట్టుపై ముంబై 10 వికెట్ల తేడాతో జ‌య‌భేరి మోగించింది.

ఈ నేప‌థ్యంలో విజ‌యానంత‌రం శ్రేయ‌స్ అయ్య‌ర్ మాట్లాడుతూ.. "గ‌తం గురించి ఆలోచించ‌ను. వ‌ర్త‌మానంలో జీవించాల‌నుకుంటున్నాను. నాకు ఏ ప‌నినైతే అప్ప‌గించారో అది విజ‌య‌వంతంగా పూర్తి చేశాను. రంజీ ఆడ‌మ‌న్నారు. వ‌చ్చాను.. ఆడాను.. నా ప్ర‌ణాళిక‌లు అమ‌లు చేశాను.

కావాల్సినంత ప్రాక్టీస్
నా ప్ర‌ద‌ర్శ‌న ప‌ట్ల సంతోషంగా ఉన్నాను. కొన్ని విష‌యాలు మ‌న ఆధీనంలో ఉండ‌వు. అలాంటి వాటి గురించి ఆలోచించ‌క‌పోవ‌డ‌మే మంచిది. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్ సంద‌ర్భంగా బాల్ బాగా ట‌ర్న్ అయ్యే వికెట్లు అందుబాటులో ఉండ‌టం స‌హ‌జం. నాకు ఇది సానుకూలాంశం.

ఏదేమైనా ఈ రంజీ మ్యాచ్ ద్వారా నాకు కావాల్సినంత ప్రాక్టీస్ ల‌భించింది. మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించాను. ఇంగ్లండ్‌తో మొద‌టి రెండు టెస్టుల్లో ఎలా ఆడాల‌న్న‌దాని గురించే ప్ర‌స్తుతం ఆలోచిస్తున్నా.

నా ధ్యాసంతా ఆ రెండు మ్యాచ్‌ల‌పైనే ఉంది" అని పేర్కొన్నాడు. కాగా స్వ‌దేశంలో ఇంగ్లండ్‌తో టీమిండియా ఐదు టెస్టుల సిరీస్ జ‌న‌వ‌రి 25 నుంచి ఆరంభం కానుంది. ఇందుకు సంబంధించి తొలి రెండు మ్యాచ్‌ల‌కు బీసీసీఐ ప్ర‌క‌టించిన జ‌ట్టులో శ్రేయ‌స్ అయ్య‌ర్‌కు చోటు ద‌క్కింది.

Advertisement
 
Advertisement
Advertisement