
కొలొంబో వేదికగా శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్ట్లో బంగ్లాదేశ్ ఓటమి దిశగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 115 పరుగులు మాత్రమే చేసింది. శ్రీలంక తొలి ఇన్నింగ్స్ స్కోర్కు బంగ్లాదేశ్ ఇంకా 96 పరుగులు వెనుకపడి ఉంది. లిట్టన్ దాస్ (13) క్రీజ్లో ఉన్నాడు.
శ్రీలంక బౌలర్లు ధనంజయ డిసిల్వ (4-1-13-2), ప్రభాత్ జయసూర్య (15-2-47-2), తిరిండు రత్నాయకే (2.4-0-10-1), అశిత ఫెర్నాండో (8-1-22-1) చెలరేగడంతో బంగ్లాదేశ్ సెకెండ్ ఇన్నింగ్స్లో పేకమేడలా కూలుతుంది. బంగ్లా ఆటగాళ్లలో ఒక్కరు కూడా క్రీజ్లో కుదురుగా నిలబడలేకపోతున్నారు.
ఇప్పటివరకు ఔటైన ఆరుగురు రెండంకెల స్కోర్లు చేయగలిగారు కానీ, ఒక్కరు కూడా భారీ స్కోర్ చేయలేకపోయారు. షద్మాన్ ఇస్లాం 12, అనాముల్ హక్ 19, మొమినుల్ హక్ 15, నజ్ముల్ షాంటో 19, ముష్ఫికర్ రహీం 26, మెహిది హసన్ 11 పరుగులకు ఔటయ్యారు.
290/2 స్కోర్ వద్ద ఇవాళ (మూడో రోజు) ఆటను ప్రారంభించిన శ్రీలంక మరో 168 పరుగులు జోడించి మిగతా 8 వికెట్లు కోల్పోయింది. ఓవర్నైట్ బ్యాటర్ నిస్సంక తన సెంచరీకి మరో 12 పరుగులు జోడించి 158 పరుగుల వద్ద ఔటయ్యాడు. మరో ఓవర్నైట్ బ్యాటర్ ప్రభాత్ జయసూర్య తన వ్యక్తిగత స్కోర్కు మరో 5 పరుగులు జోడించి ఔటయ్యాడు.
ఆతర్వాత వచ్చిన బ్యాటర్లలో కుసాల్ మెండిస్ (84) సెంచరీకి చేరువై ఔట్ కాగా.. కమిందు మెండిస్ (33) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. అంతకుముందు దినేశ్ చండీమల్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. లహీరు ఉడార 40 పరుగులు చేశాడు. మొత్తంగా శ్రీలంక తొలి ఇన్నింగ్స్లో 458 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 5 వికెట్లు తీశాడు. నయీమ్ హసన్ 3, నహిద్ రాణా ఓ వికెట్ పడగొట్టారు.
అంతకుముందు బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 247 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా ఇన్నింగ్స్లో ఓపెనర్ షద్మాన్ ఇస్లాం (46) టాప్ స్కోరర్ కాగా.. మొమినుల్ హక్ (21), ముష్ఫికర్ రహీం (35), లిటన్ దాస్ (34), మెహిది హసన్ మిరాజ్ (31), నయీమ్ హసన్ (25), తైజుల్ ఇస్లాం (33) రెండంకెల స్కోర్లు చేశారు. అనాముల్ హక్ 0, కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో 8, ఎబాదత్ హొసేన్ 8 పరుగులకు ఔటయ్యారు.
బంగ్లా ఇన్నింగ్స్ను అశిత ఫెర్నాండో (18-2-51-3), విశ్వ ఫెర్నాండో (19-4-45-2), సోనల్ దినుష (9.3-3-22-3), ధనంజయ డిసిల్వ (5-0-15-1), తిరండు రత్నాయకే (17-1-72-1) దెబ్బకొట్టారు.
కాగా, రెండు టెస్ట్లు, మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ల కోసం బంగ్లాదేశ్ జట్టు శ్రీలంకలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్లో ఇరు జట్లు ఆటగాళ్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
ఇరు జట్ల తరఫున నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. బంగ్లా కెప్టెన్ నజ్ముల్ హసన్ షాంటో రెండు ఇన్నింగ్స్ల్లో (148, 125 నాటౌట్) సెంచరీలు చేయగా.. ముష్ఫికర్ రహీం (163),పథుమ్ నిస్సంక (187) తమతమ తొలి ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేశారు.