టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్ శుబ్మన్ గిల్ షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్ని ఘనంగా ఆరంభించాడు. ఈ టోర్నమెంట్లో ఫాజిల్కా ఫాల్కన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న గిల్.. ఆదివారం మొహాలీ వేదికగా లుధియానా లయన్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఫాల్కన్స్కు శుబ్మన్ అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. తన టీమిండియా సహచరుడు, స్టార్ బౌలర్ అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో శుబ్మన్ బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 21 బంతులు మాత్రమే ఎదుర్కొన్న గిల్.. 7 ఫోర్లు, ఒక సిక్సర్తో 40 పరుగులు చేశాడు.
ఉత్కంఠ పోరు
అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లుధియానా లయన్స్ విజయానికి కేవలం ఒక్క పరుగు దూరంలో నిలిచిపోయింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితమైంది. మాధవ్ పఠానియా (37 నాటౌట్) ఆఖరి వరకు నిలిచి పోరాడినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.
చివరి ఓవర్లో లుధియానా గెలుపునకు 19 పరుగులు అవసరం కాగా.. 17 పరుగులు మాత్రమే రాబట్టగలిగింది. మరో ఒక్క పరుగు చేసి ఉంటే ఈ మ్యాచ్ సూపర్ ఓవర్కు దారితీసేది. ఫాల్కన్స్ బౌలర్లలో విహాన్ మల్హోత్రా, దత్తా తలా రెండు వికెట్లు చొప్పున తీశారు.
చదవండి: ఆ ఒక్కటి జింబాబ్వే కొంపముంచింది; ట్రై సిరీస్ విజేత సౌతాఫ్రికా


