షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్లో మొహాలీ కింగ్స్ మరో సంచలన విజయం సాధించింది. శనివారం మొహాలీ వేదికగా జలంధర్ వారియర్స్తో జరిగిన మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో మొహాలీ గెలుపొందింది. తొలుత వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 14 ఓవర్లకు కుదించారు.
ఈ క్రమంలో మొదట బ్యాటింగ్ చేసిన జలంధర్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. మొహాలీ బ్యాటర్లలో విశ్వనాథ్ సింగ్(40), కెప్టెన్ ప్రభ్సిమ్రాన్ సింగ్(37), హర్జస్ సింగ్(37) రాణించారు. మొహాలీ బౌలర్లలో హర్ప్రీత్ బ్రార్, హర్ష్దీప్ సింగ్, తేజ్ప్రీత్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.
రమణ్దీప్ మెరుపులు
అనంతరం లక్ష్య చేధనలో మొహాలీ కింగ్స్ కెప్టెన్ రమణ్దీప్ సింగ్ విధ్వంసం సృష్టించాడు. నాలుగో స్దానంలో బ్యాటింగ్కు వచ్చిన రమణ్దీప్.. ప్రత్యర్ది బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డాడు. కేవలం 35 బంతుల్లోనే 6 ఫోర్లు, 8 సిక్స్లతో 91 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.
అతడితో పాటు అన్మోల్ప్రీత్ సింగ్(29 బంతుల్లో 61) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఫలితంగా 178 పరుగుల లక్ష్యాన్ని మొహాలీ కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 13 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ విజయంతో మొహాలీ కింగ్స్ పాయింట్ల పట్టికలో రెండో స్ధానానికి చేరుకుంది.
ఇక రమణ్దీప్ విషయానికి వస్తే.. టీమిండియా తరపున కేవలం రెండు మ్యాచ్లు మాత్రమే ఆడాడు. 2024లో సౌతాఫ్రికా టూర్లో ఆడిన రమణ్దీప్కు తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. ఇండియా-ఎ టీమ్లో మాత్రం అతడు కీలక సభ్యునిగా ఉన్నాడు. ఇప్పుడు ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్స్లో మరింత మెరుగ్గా రాణించి సీనియర్ జట్టులోకి ఎంట్రీ ఇవ్వాలని ఈ పంజాబ్ ఆల్రౌండర్ భావిస్తున్నాడు.


