source: BCCI X
టీమిండియా స్టార్ బ్యాటర్, భారత టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ లోకల్ ఫైట్లోకి దిగనున్నాడు. తన సొంత రాష్ట్రం పంజాబ్లో జరిగే షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు. ఈ టోర్నీలో గిల్ ఫజిల్కా ఫాల్కన్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించనున్నాడు. సెప్టెంబర్ 5న బటిండా రాయల్స్తో జరిగే మ్యాచ్లో అతడు బరిలోకి దిగే అవకాశం ఉంది. దీని కోసం గిల్ ఇప్పటికే ప్రాక్టీస్ మొదలుపెట్టాడు.
శ్రీలంకతో టెస్ట్ సిరీస్ కారణంగా గిల్ షేర్-ఎ-పంజాబ్ టోర్నీలో తొలి మూడు మ్యాచ్లకు అందుబాటులో లేడు. అతని గైర్హాజరీలో సన్వీర్ సింగ్ జట్టుకు నాయకత్వం వహించాడు. అతడి సారథ్యంలో ఫాల్కన్స్ ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. రెండు మ్యాచ్ల్లో ఓడిపోయి ఆరు జట్ల పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.
షేర్-ఎ-పంజాబ్ టోర్నీలో గిల్తో పాటు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ, పేసర్ అర్ష్దీప్ సింగ్, పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్, ముంబై ఇండియన్స్ ఆటగాడు నమన్ ధిర్ తదితర స్టార్లు కూడా ఆడుతున్నారు.
టీ20 జట్టులోకి పునరాగమనమే లక్ష్యం
భారత టీ20 జట్టులో పునరాగమనమే లక్ష్యంగా గిల్ షేర్-ఎ-పంజాబ్ టోర్నీలో ఆడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది చివరి వరకు గిల్ భారత టీ20 జట్టులో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్గా ఆడాడు. 2025 ఆసియా కప్ గెలిచిన భారత జట్టులోనూ అతడు సభ్యుడిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్ల్లోనూ జట్టులో కొనసాగాడు.
అయితే టీ20ల్లో ఆశించిన స్థాయిలో పరుగులు చేయలేకపోవడంతో సెలెక్టర్లు అతడిని జట్టు నుంచి తప్పించారు. అతని స్థానంలో సంజూ శాంసన్కు అవకాశం ఇచ్చారు.
డిసెంబర్ 2025లో తన 36వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన తర్వాత గిల్ ఇప్పటివరకు టీ20 జట్టులోకి తిరిగి రాలేదు. షేర్-ఎ-పంజాబ్ లీగ్లో మంచి ప్రదర్శన చేసి టీమిండియాలోకి పునరాగమనం చేయాలని అతడు పట్టుదలగా ఉన్నట్లు కనిపిస్తోంది.
చదవండి: నేడు పాకిస్తాన్తో భారత్ ఢీ


