మరోసారి చెలరేగిన భువీ.. టీమిండియా సెలెక్టర్లకు సవాల్‌ | Bhuvneshwar Kumar Reminds Selectors Of T20I Comeback With Magical Spell | Sakshi
Sakshi News home page

మరోసారి చెలరేగిన భువీ.. టీమిండియా సెలెక్టర్లకు సవాల్‌

Sep 4 2026 4:38 AM | Updated on Sep 4 2026 4:38 AM

Bhuvneshwar Kumar Reminds Selectors Of T20I Comeback With Magical Spell

టీమిండియాకు దూరమైన సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి తన సత్తా చాటాడు. యూపీ టీ20 లీగ్‌ 2026లో లక్నో ఫాల్కన్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న అతడు.. నిన్న మీరట్ మావెరిక్స్‌తో జరిగిన తొలి క్వాలిఫయర్‌లో అబ్బురపడే ప్రదర్శన చేశాడు. నాలుగు ఓవర్లలో కేవలం 10 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫాల్కన్స్ 19.4 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది. జీషన్‌ అన్సారీ (4-0-14-3) అద్భుతంగా బౌలింగ్‌ చేసి ఫాల్కన్స్‌ను కట్టడి చేశాడు. అతడకి కార్తీక్‌ త్యాగి (4-0-38-2), విశాల్‌ చౌదరి (4-0-23-1) సహకరించారు. ఫాల్కన్స్‌ ఇన్నింగ్స్‌లో హిమాన్షు సింగ్‌ (61) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు.

అనంతరం 146 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో భువనేశ్వర్‌ కుమార్‌ మ్యాజిక్‌ చేశాడు. అతడికి అభినందన్‌ సింగ్‌ (4-0-28-2), కృష్ణ్‌ కుమార్‌ సరోజ్‌ (4-0-20-1), విప్రాజ్‌ నిగమ్‌ (4-0-15-1) కూడా తోడవడంతో రింకూ సింగ్‌ నేతృత్వంలోని మీరట్ మావెరిక్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 98 పరుగులకే పరిమితమైంది. 

ఫలితంగా ఫాల్కన్స్‌ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. మావెరిక్స్‌ తరఫున రింకూ సింగ్‌ (34), జీషన్‌ అన్సారీ (30 నాటౌట్‌) పోరాటం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

కాగా, యూపీ టీ20 లీగ్‌ ప్రస్తుత సీజన్‌లో భువీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. పలు మ్యాచ్‌ విన్నింగ్‌ ప్రదర్శనలు చేసి, తన జట్టును ఫైనల్‌కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 5.88 ఎకానమీతో 13 వికెట్లు తీశాడు.

దీనికి ముందు ఐపీఎల్ 2026లోనూ భువీ అద్భుత ప్రదర్శన చేశాడు. ఆర్సీబీ తరఫున 16 ఇన్నింగ్స్‌ల్లో 28 వికెట్లు పడగొట్టి, జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుముందు 2025 సీజన్‌లోనూ 17 వికెట్లతో సత్తా చాటి ఆర్సీబీకి తొలి టైటిల్‌ గెలిపించాడు. మొత్తంగా ఆర్సీబీ తరఫున గత రెండు సీజన్లలో ఏకంగా 45 వికెట్లు సాధించాడు.

ఈ అద్భుత ప్రదర్శనల తర్వాత భువీ తిరిగి టీమిండియా వైపు చూస్తున్నాడు. 2022 నవంబర్‌లో చివరిసారి టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అతడు.. దాదాపు నాలుగేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అయితే దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌లో వరుసగా మెరుగైన ప్రదర్శనలు చేస్తూ పునరాగమనానికి తలుపులు తడుతున్నాడు. తాజా యూపీ టీ20 ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని మరోసారి ఆకర్షించాడు.

చదవండి: సిరాజ్‌తో పాటు ఆ ఇద్దరు టీమిండియా స్టార్లకు పిలుపు!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement