భారత ఫుట్బాల్ జట్టును ఎంపిక చేశామన్న హెడ్ కోచ్ జమీల్
న్యూఢిల్లీ: బ్రెజిల్, ఉరుగ్వే వంటి మేటి జట్లతో పోటీపడనున్న భారత పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక కేవలం ప్రతిభ ఆధారంగానే జరిగిందని హెడ్ కోచ్ ఖాలిద్ జమీల్ స్పష్టం చేశాడు. త్వరలో భారత జట్టు పనామా, బ్రెజిల్, ఉరుగ్వేలతో అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్లు ఆడనుండగా... దాని కోసం అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య 26 మందితో కూడిన ప్రాబబుల్స్ను ఎంపిక చేసింది. అయితే ఇందులో మాజీ కెప్టెన్ సందేశ్ జింగాన్, రాహుల్ భేకే, లాలియన్జులా, విశాల్, లిస్టన్ కొలాకో, జీక్సన్ సింగ్ వంటి సీనియర్ ప్లేయర్లకు ప్రాబబుల్స్లో చోటు దక్కలేదు.
పలువురు సీనియర్ ప్లేయర్లకు అవకాశం దక్కకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జమీల్ స్పందించాడు. ‘కేవలం ప్రతిభ, ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్ల ఎంపిక జరిగింది. శిక్షణ సమయంలో అందరి ప్రదర్శనను పరిగణనలోకి తీసుకున్నాకే ఎంపిక చేశాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అర్హులైన వారికి మాత్రమే చాన్స్ దక్కింది. జట్టులో సీనియర్, జూనియర్ అనే తేడా లేదు. అందరూ జాతీయ స్థాయి ఆటగాళ్లే. ఈ జట్టుపై నాకు ఎంతో నమ్మకముంది.
మాజీ కెప్టెన్ సునీల్ ఛెత్రీలాంటి ప్లేయర్లు జట్టుకు కావాలి. అతడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా అవకాశాలు సృష్టించుకునేందుకు ప్రయత్నిస్తాడు. అతన్ని జట్టంతా రోల్మోడల్గా తీసుకోవాలి’ అని జమీల్ అన్నాడు. ఆసియా కప్ టోర్నీకి అర్హత సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భారత జట్టు... మెరుగైన ర్యాంక్లో ఉన్న జట్లతో పోటీపడటం ద్వారా నైపుణ్యాలను పెంచుకోవచ్చని భావిస్తోంది.


