భారత బృందానికి నీతల్ ఎంపిక
న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత బృందంతో పాటు ప్రత్యేకంగా ‘సేఫ్గార్డింగ్ ఆఫీసర్’ను పంపిస్తున్నారు. ఈ తరహాలో క్రీడల కోసం అధికారిని నియమించడం ఇదే తొలిసారి. ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) సూచనలతో ఈ ఏర్పాటు అనివార్యమైంది. సాఫ్ట్ బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు నీతల్ నారంగ్ ‘సేఫ్గార్డింగ్ ఆఫీసర్’ హోదాలో జట్టుతో పాటు ప్రయాణిస్తారు.
వేధింపులు, దుర్భాషలు వంటి సమస్యలతో పాటు సౌకర్యాల విషయంలో ఏదైనా నిర్లక్ష్యం కనిపిస్తే అథ్లెట్ల తరఫున వాటి పరిష్కారం కోసం నీతల్ పని చేస్తారు. గతంలో భారత బాక్సింగ్ సమాఖ్యలో కూడా పని చేసిన నీతల్... సేఫ్గార్డింగ్ ఆఫీసర్గా పని చేసేందుకు అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ) అందించే సర్టిఫికెట్ కోర్సును పూర్తి చేశారు.
మరోవైపు ఆసియా క్రీడల్లో భారత్ నుంచి మొత్తం 246 మంది సహాయక సిబ్బంది పాల్గొంటుండగా, వీరిలో 56 మంది మాత్రమే మహిళలు ఉండటంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం మహిళా ఆటగాళ్లే పాల్గొంటున్న జూడో, గోల్ఫ్ టీమ్లతో కూడా ఒక్క మహిళా అధికారిని పంపకపోవడం చర్చనీయాంశంగా మారింది.


