PC: CAB X
భారత అండర్-19 క్రికెటర్, బెంగాల్ లెగ్ స్పిన్నర్ రోహిత్ యాదవ్పై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన చర్యలు తీసుకుంది. వయసుకు సంబంధించి తప్పుడు ఆధారాలు సమర్పించాడనే కారణంతో రెండేళ్ల పాటు అతడిపై నిషేధం విధించినట్లు తెలుస్తోంది.
స్పోర్ట్స్ స్టార్ కథనం ప్రకారం.. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని.. బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ ఆదేశాలను అమలు చేయాలని బీసీసీఐ పేర్కొన్నట్లు సమాచారం. కాగా రోహిత్ యాదవ్ ఇటీవలి కాలంలో భారత్ అండర్-19 జట్టు తరఫున మెరుగ్గా రాణిస్తున్నాడు.
శ్రీలంక పర్యటనలో
శ్రీలంక పర్యటనలో భాగంగా యూత్ టెస్టుల్లో రోహిత్ యాదవ్ ఆరు వికెట్లు పడగొట్టాడు. ఈ నేపథ్యంలో స్వదేశంలో ఆస్ట్రేలియాతో సెప్టెంబరులో జరిగే సిరీస్కు కూడా సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు. ఆసీస్తో యూత్ వన్డే, యూత్ టెస్టులు ఆడే జట్టులో అతడికి చోటు దక్కింది.
వేర్వేరుగా వివరాలు
అయితే, అనూహ్య రీతిలో రోహిత్ యాదవ్పై రెండేళ్ల పాటు నిషేధం పడటం గమనార్హం. కాగా గత కొన్నేళ్లుగా తన పుట్టిన సంవత్సరానికి సంబంధించి రోహిత్ వేర్వేరు పత్రాల్లో వేర్వేరు వివరాలు సమర్పించినట్లు సమాచారం. బెంగాల్ అసోసియేషన్కు 2014లో ఇచ్చిన వివరాల్లో తాను జూలై 7, 2007లో జన్మించినట్లు అతడు పేర్కొన్నాడు.
అందులో తన చిరునామాను ఉత్తరప్రదేశ్గా పేర్కొన్నాడు. అయితే, 2017లో ఆధార్ అప్డేట్ సందర్భంగా తాను 2006లో జన్మించినట్లు రోహిత్ యాదవ్ తెలిపాడు. ఆ తర్వాత 2020, 2021లో మరోసారి అప్డేట్ చేసుకోగా.. ఈసారి తాను 2009లో జన్మించినట్లు పేర్కొన్నాడు.
ఈ నేపథ్యంలో రోహిత్ యాదవ్ తీరుపై అనుమానం రాగా బెంగాల్ అసోసియేషన్ సమీక్షలో భాగంగా.. అతడు మోసానికి పాల్పడినట్లు తేలినట్లు సమాచారం. కాగా రోహిత్ యాదవ్ స్థానంలో కనిష్క్ చౌహాన్ లేదంటే మహ్మద్ ఎనాన్ ఆసీస్తో సిరీస్ ఆడే జట్టులో చేరే అవకాశం ఉంది.


