సీఓఈని కోరనున్న సెలక్టర్లు, కోచ్
నేడు బీసీసీఐ సమీక్షా సమావేశం
న్యూఢిల్లీ: భారత క్రికెట్కు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించేందుకు నేడు బీసీసీఐ ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తోంది. బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్లతో పాటు చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ దీనికి హాజరు కానున్నారు. ప్రధానంగా మూడు అంశాలు ఇక్కడ చర్చకు రానున్నాయి. గాయాలతో బాధపడుతూ సీఓఈలో రీహాబిలిటేషన్లో ఉన్న ఆటగాళ్ల అందుబాటులో విషయంలో సీఓఈ నుంచి అగార్కర్, గంభీర్ మరింత స్పష్టత కోరుతున్నారు. ఆయా ఆటగాళ్లంతా ఎప్పటి వరకు పూర్తిగా ఫిట్గా మారతారో ఒక తేదీని ప్రకటించాలని, అప్పుడే జట్టును ఎంపిక చేసే విషయంలో నిర్ణయం తీసుకోగలమని వీరు చెబుతున్నారు.
నిజానికి గాయాల తీవ్రత, వేర్వేరు వ్యక్తుల ఫిట్నెస్ స్థాయిని బట్టి చూస్తే ఇలా క చ్చితంగా తేదీని చెప్పడం కష్టమే అయినా... ఇటీవలి పరిణామాలు భారత టీమ్ మేనేజ్మెంట్కు అసహనం కలిగించాయి. శ్రీలంకతో రెండో టెస్టుకు బుమ్రా అందుబాటులో ఉంటాడని చెప్పగా అది సాధ్యం కాలేదు. హార్దిక్ పాండ్యా ఎప్పుడు రెడీ అవుతాడో చెప్పలేని పరిస్థితి ఉంది. నెలల తరబడి ఇక్కడ ఉంటున్నా ఆకాశ్దీప్ కోలుకోలేదు. ఇప్పుడు అఫ్గానిస్తాన్తో సిరీస్కు కూడా పూర్తిగా ఫిట్గా లేకుండానే సందేహాల మధ్య నలుగురు ఆటగాళ్లను ప్రకటించారు. కాబట్టి సమావేశంలో లక్ష్మణ్ దీనిపై వివరణ ఇవ్వాల్సి రావచ్చు.
రోహిత్ శర్మ భవిష్యత్తు విషయంలో కూడా చర్చ జరగవచ్చు. ఇటీవల ఇంగ్లండ్తో సిరీస్ ముగియగానే అతను రిటైర్ అవుతాడని అంతా భావించినా... చివరి వన్డేలో అద్భుత సెంచరీ చేయడంతో ఆ చర్చకు తెర పడింది. అయితే సరే వచ్చే వరల్డ్ కప్ వరకు రోహిత్ను కొనసాగించే అంశంపై ఇంకా గ్యారంటీ లేదు. మరోవైపు అక్టోబర్ 4తో సెలక్టర్గా అగార్కర్ కాంట్రాక్ట్ ముగియనుంది. అయితే 2027 వరల్డ్ కప్ను దృష్టిలో ఉంచుకొని అతని పదవీకాలాన్ని పొడిగిస్తారా అనే విషయంలో ఈ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


