దుబాయ్: ఆరు దేశాలతో తొలిసారి నిర్వహించనున్న మహిళల చాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించింది. నిజానికి ఈ టోర్నీ శ్రీలంకలో జరగాల్సి ఉంది. అయితే నిర్వహణాపరమైన సమస్యలవంటి కారణాలతో ఐసీసీ వేదికను మార్చాల్సి వచ్చింది. శ్రీలంకలో ప్రస్తుతం అక్కడి ప్రభుత్వం నియమించిన తాత్కాలిక బోర్డు పని చేస్తోంది. దీనిని ఐసీసీ గుర్తించకపోవడంతో వేదికను మార్చక తప్పలేదు. ఆతిథ్య హక్కుల విషయంలో దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ల గురించి కూడా చర్చ జరిగినా చివరకు భారత్లోనే టోర్నీని జరపాలని ఐసీసీ నిర్ణయించింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు చాంపియన్స్ ట్రోఫీ జరుగుతుంది. ముంబైలోని బ్రబోర్న్ స్టేడియంతో పాటు వడోదరలో మ్యాచ్లు నిర్వహిస్తారు. అయితే పురుషుల చాంపియన్స్ ట్రోఫీ వన్డే ఫార్మాట్లో నిర్వహిస్తుండగా, మహిళల టోర్నీ టి20 ఫార్మాట్లో జరుగుతుంది. ఈ ఏడాది జూలై 6 కటాఫ్ తేదీ కాగా... అప్పటి వరకు ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్–6 స్థానాల్లో ఉన్న భారత్, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక ఈ టోర్నీకి అర్హత సాధించాయి. ఆరు జట్లు లీగ్ దశలో భాగంగా ఐదు ప్రత్యర్థి జట్లతో తలపడతాయి. టాప్–2 జట్లు ఫైనల్కు చేరతాయి.


