లండన్: ప్రతిష్టాత్మక లండన్ స్క్వాష్ క్లాసిక్ టోర్నమెంట్లో భారత ప్లేయర్లు అనాహత్ సింగ్, రమిత్ టాండన్ శుభారంభం చేశారు. ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్ఏ) గోల్డ్ ఈవెంట్లో భాగంగా బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్ల్లో వీరిద్దరూ విజయాలు సాధించి ముందంజ వేశారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ జూనియర్ చాంపియన్ అనాహత్ 11–3, 11–2 తేడాతో ఈజిప్ట్ ప్లేయర్ మరియం మెత్వాలీపై ఘనవిజయం సాధించింది. ప్రపంచ ర్యాంకింగ్స్లో 20వ స్థానంలో ఉన్న అనాహత్ జోరు ముందు మరియం నిలవలేకపోయింది. ప్రత్యర్థి నుంచి కనీస పోటీ ఎదుర్కోకుండానే 18 ఏళ్ల అనాహత్ రెండో రౌండ్లో అడుగుపెట్టింది.
ఇటీవల జూనియర్ ప్రపంచ టైటిల్ నెగ్గిన తొలి భారతీయురాలిగా రికార్డు నెలకొల్పిన అనాహత్... గత రెండు సీజన్లుగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తోంది. ఇక పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ 42వ ర్యాంకర్ రమిత్ టాండన్ 11–6, 11–7 తేడాతో ఖతార్కు చెందిన అబ్దుల్లా అల్ తమీమిపై గెలుపొందాడు. కాగా... మరో భారత ప్లేయర్, ప్రపంచ 38వ ర్యాంకర్ వీర్ చోత్రాని తొలి రౌండ్లో 9–11, 9–11 తేడాతో స్విట్జర్లాండ్ ప్లేయర్ యానిక్ విల్మెల్మీ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.


