ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్షిప్ టైటిల్తో కొత్త చరిత్ర
ఈజిప్ట్ క్రీడాకారిణులపై వరుస విజయాలు
లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పతకమే లక్ష్యంగా సాధన
స్క్వాష్ అంటే ఈజిప్ట్... ఈజిప్ట్ అంటే స్క్వాష్... ఈ ‘రాకెట్ క్రీడ’లో ఈజిప్ట్ క్రీడాకారులు రాకెట్ వేగంతో అత్యున్నత శిఖరానికి చేరుకున్నారు. కారణాలు ఏమైతేనేం కొన్నేళ్లుగా అంతర్జాతీయ స్క్వాష్లో ఈజిప్ట్ ప్లేయర్లు సాధిస్తున్న విజయాలు అసాధారణం. ప్రపంచ చాంపియన్షిప్ మొదలుకొని... ప్రొఫెషనల్ టూర్లో... అంతర్జాతీయ టోర్నీల్లో ఈజిప్ట్ క్రీడాకారులే టైటిల్స్ సొంతం చేసుకుంటున్నారు. సీనియర్లు ఓడిపోతే జూనియర్లు... జూనియర్లు కాకపోతే ద్వితీయశ్రేణి ఆటగాళ్లు... కేటగిరీ మారినా... టోర్నీ స్థాయి మారినా... చివరకు టైటిల్స్ ఈజిప్ట్ ఖాతాలోకే వెళ్లడం సాధారణమైపోయింది.
కెనడాలోని ఒంటారియోలో శనివారం ముగిసిన ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లోనూ ఈజిప్ట్ క్రీడాకారులు టైటిల్స్ ఎగురేసుకుపోవడం ఖాయమనుకున్నారు. కానీ ఈజిప్ట్ జైత్రయాత్రకు భారత ‘నయా రాకెట్’ అనాహత్ సింగ్ అడ్డుకట్ట వేసింది. వరుసగా మూడు మ్యాచ్ల్లో ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించి మహిళల సింగిల్స్ విభాగంలో కొత్త జగజ్జేతగా అవతరించింది. అనాహత్ దెబ్బకు...గత 16 ఏళ్లుగా వరుసగా ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విభాగంలో టైటిల్ నెగ్గిన ఈజిప్ట్ క్రీడాకారిణులు ఈసారి రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకున్నారు.
–సాక్షి క్రీడా విభాగం
మరో రెండేళ్లలో జరిగే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో స్క్వాష్ క్రీడ తొలిసారి మెడల్ ఈవెంట్గా అరంగేట్రం చేయనుంది. అంతా అనుకున్నట్లు జరిగితే భారత్ తొలి ప్రయత్నంలోనే స్క్వాష్లో పతకం సాధించే అవకాశం ఉంది. ఇంత నమ్మకం ఎందుకంటే... భారత రైజింగ్ సాŠట్ర్ అనాహత్ సింగ్ అసాధారణ ప్రదర్శన గమనించాక అంచనాలు అమాంతం పెరిగాయి. నాలుగేళ్లుగా అంతర్జాతీయ సర్క్యూట్లో నిలకడగా రాణిస్తున్న అనాహత్ తాజాగా ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో విజేతగా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ స్క్వాష్ ప్లేయర్గా కొత్త చరిత్ర సృష్టించింది.
2005లో జోష్నా చినప్ప ఫైనల్కు చేరినా... తుది పోరులో ఓడిపోయి రజత పతకంతో సరిపెట్టుకుంది. అనాహత్ మాత్రం ఫైనల్ చేరిన తొలి ప్రయత్నంలోనే జగజ్జేతగా నిలిచింది. గత ఏడాది ఇదే ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్లో సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకంతో సంతృప్తి పడ్డ అనాహత్ ఈసారి మాత్రం అదరగొట్టింది. చాంపియన్గా నిలిచిన క్రమంలో ఆమె వరుసగా క్వార్టర్ ఫైనల్, సెమీఫైనల్, ఫైనల్ మ్యాచ్ల్లో ముగ్గురు ఈజిప్ట్ క్రీడాకారిణులను ఓడించడం విశేషం. ఈ ఏడాది తర్వాత 18 ఏళ్ల అనాహత్ జూనియర్ సర్క్యూట్లో పాల్గొనే అవకాశం లేదు. ప్రస్తుతం ప్రపంచ సీనియర్ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్లో అనాహత్ 20వ స్థానంలో ఉంది.
వచ్చే రెండేళ్లలలో ఆమె ర్యాంక్ మరింత మెరుగయ్యే అవకాశముంది. లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్లో పురుషుల సింగిల్స్లో 16 మంది... మహిళల సింగిల్స్లో 16 మంది పోటీపడతారు. ఐదు బెర్త్లను రీజినల్ గేమ్స్ (ఆసియా, ఆఫ్రికా, పాన్ అమెరికా, యూరోపియన్, ఓసియానియా/కరీబియన్ ప్లే ఆఫ్స్) ద్వారా భర్తీ చేస్తారు. సెపె్టంబర్లో జపాన్ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో అనాహత్ సింగ్ స్వర్ణం సాధిస్తే నేరుగా లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తుంది. ఒలింపిక్స్లో ఒక దేశం నుంచి గరిష్టంగా ఇద్దరికి మాత్రమే పోటీపడే వీలుంది. ఈ నేపథ్యంలో ఈజిప్ట్ నుంచి ఇద్దరు మాత్రమే అర్హత సాధిస్తారు. ఫలితంగా అనాహత్ లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు అర్హత సాధిస్తే పతకం రేసులో కూడా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్ఫూర్తితో ఐదేళ్ల ప్రాయంలో బ్యాడ్మింటన్ రాకెట్ పట్టిన అనాహత్... ఆ తర్వాత తన సోదరి అమీరా ప్రేరణతో స్క్వాష్ వైపు మళ్లింది. 2019లో బ్రిటిష్ ఓపెన్లో అండర్–11 సింగిల్స్లో విజేతగా నిలిచి వెలుగులోకి వచి్చన అనాహత్ ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తన ఆటకు పదును పెంచుకుంటూ పోయింది. ఢిల్లీకి చెందిన అనాహత్ మూడుసార్లు ఆసియా జూనియర్ చాంపియన్గా నిలిచింది. 2022 ఆసియా క్రీడల్లో మిక్స్డ్ డబుల్స్, టీమ్ ఈవెంట్లో కాంస్య పతకాలు గెలిచింది. 2025 ఆసియా సీనియర్ చాంపియన్షిప్లో మిక్స్డ్ డబుల్స్, మహిళల డబుల్స్ విభాగాల్లో బంగారు పతకాలు సాధించింది.
‘ఈ విజయం నాకు సర్వస్వం లాంటిది. అంతా కలలా అనిపిస్తోంది. ఈ టోర్నీ నాకు శాపంలా అనిపించింది. ఎందుకంటే గత నాలుగేళ్లుగా ఈ మెగా ఈవెంట్లో క్వార్టర్ ఫైనల్ లేదా సెమీఫైనల్ దాటి ముందుకెళ్లలేకపోయాను. అయితే ఈసారి అన్నీ అధిగమించి టైటిల్ అందుకున్నాను. ఈ గెలుపు ఇంకా ప్రత్యేకంగా మారింది. ఎందుకంటే జూనియర్ విభాగంలో నాకిదే చివరి సంవత్సరం. ప్రపంచ జూనియర్ చాంపియన్షిప్ టైటిల్ గెలిచేందుకు నా ముందున్న చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నా. ఒత్తిడి పెంచుకుంటే నా ఆటతీరు దారుణంగా ఉంటుందని తెలుసు. అందుకే ఈసారి ఎలాంటి ఒత్తిడి పెట్టుకోకుండా ప్రతి పాయింట్ను ఆస్వాదించాలని బరిలోకి దిగాను.
అనుకున్నది సాధించాను’
– అనాహత్ సింగ్


