ఆసియా క్రీడల బరిలో భారత పురుషుల హాకీ జట్టు
స్వర్ణం సాధిస్తే లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్కు అర్హత
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల హాకీ జట్టును ప్రకటించారు. 20 మంది సభ్యులతో కూడిన భారత జట్టుకు డ్రాగ్ ఫ్లికర్ హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యం వహిస్తాడు. వచ్చే నెలలో నెదర్లాండ్స్లో జరిగే ప్రపంచకప్ టోర్నీలో పాల్గొనే భారత జట్టులో ఉన్న ఆదిత్య అర్జున్ లలాగేను ఆసియా క్రీడలకు ఎంపిక చేయలేదు. ఆసియా క్రీడల కోసం ఆదిత్య స్థానంలో రాజ్కుమార్ పాల్ జట్టులోకి వచ్చాడు. జపాన్ వేదికగా ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జరుగుతాయి. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన జట్టు 2028 లాస్ఏంజెలిస్ ఒలింపిక్స్కు నేరుగా అర్హత సాధిస్తుంది.
ఇప్పటి వరకు జరిగిన 16 ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీ జట్టు నాలుగుసార్లు (1966, 1998, 2014, 2022) స్వర్ణ పతకాలు, తొమ్మిదిసార్లు రజత పతకాలు, మూడుసార్లు కాంస్య పతకాలు సొంతం చేసుకుంది. ప్రతి ఆసియా క్రీడల నుంచి భారత హాకీ జట్టు పతకంతో తిరిగి రావడం విశేషం. ‘చాలా అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో ఆసియా క్రీడలకు వెళ్తున్నాం. స్వర్ణ పతకం సాధించి ఒలింపిక్స్కు అర్హత సాధించడమే మా అందరి లక్ష్యం’ అని టీమిండియా చీఫ్ కోచ్ క్రెయిగ్ ఫుల్టన్ వ్యాఖ్యానించారు.
సెప్టెంబర్ 20న ఇండోనేసియాతో జరిగే పూల్ ‘ఎ’ మ్యాచ్తో భారత్ తమ టైటిల్ వేటను ప్రారంభిస్తుంది. ఆ తర్వాత 22న శ్రీలంకతో, 24న దక్షిణ కొరియాతో, 26న జపాన్తో, 28న బంగ్లాదేశ్తో భారత్ ఆడుతుంది. లీగ్ దశ ముగిశాక రెండు పూల్స్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్కు చేరుకుంటాయి. పూల్ ‘బి’లో పాకిస్తాన్, మలేసియా, చైనా, ఒమన్, ఉజ్బెకిస్తాన్, థాయ్లాండ్ జట్లున్నాయి.
భారత హాకీ జట్టు
మోహిత్, సూరజ్ (గోల్కీపర్లు) హర్మన్ప్రీత్ సింగ్ (కెప్టెన్)
డిఫెండర్లు
జర్మన్ప్రీత్ సింగ్
అమిత్ రోహిదాస్
జుగ్రాజ్ సింగ్
సంజయ్
సుమిత్
యశ్దీప్ సివాచ్
మిడ్ఫీల్డర్లు
రాజిందర్ సింగ్
రాజ్కుమార్ పాల్
హార్దిక్ సింగ్
మన్ప్రీత్ సింగ్
నీలకంఠ శర్మ
వివేక్ సాగర్ ప్రసాద్
ఫార్వర్డ్స్
దిల్ప్రీత్ సింగ్
శిలానంద్ లాక్రా
సుఖ్జీత్ సింగ్
మన్దీప్ సింగ్
అభిషేక్


