source: X
నమీబియా టీ20 ట్రై సిరీస్లో జింబాబ్వే మరో విజయాన్ని నమోదు చేసి ఫైనల్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. ఈ టోర్నీలో ఇదివరకే ఓసారి నమీబియాను ఓడించిన జింబాబ్వే, తాజాగా మరోసారి ఆ జట్టును చిత్తు చేసింది.
ఇవాళ జరిగిన మ్యాచ్లో జింబాబ్వే నమీబియాపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. నమీబియా బ్యాటర్ గెర్హార్డ్ ఎరాస్మస్ మెరుపు ఇన్నింగ్స్తో (48 బంతుల్లో 88 నాటౌట్) ఆకట్టుకున్నప్పటికీ.. ఇన్నోసెంట్ కయా (42 బంతుల్లో 72; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసక ఇన్నింగ్స్తో జింబాబ్వేకు సునాయాస విజయాన్నందించాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఎరాస్మస్కు అలెగ్జాండర్ వోల్షెంక్ (29) సహకరించడంతో నమీబియా ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. వీరిద్దరూ నాలుగో వికెట్కు 83 పరుగులు జోడించారు.
జింబాబ్వే బౌలర్లలో బ్రాడ్ ఈవాన్స్, కుండయ్ మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. ముజరబానీ, సికందర్ రజా చెరో వికెట్ పడగొట్టాడు.
157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే.. ఇన్నోసెంట్ కయా, బ్రియాన్ బెన్నెట్ (22), సికందర్ రజా (29) రాణించడంతో 18.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. నమీబియా బౌలర్లలో ట్రంపల్మన్ 2 వికెట్లు తీయగా.. స్మిట్, జాక్ బ్రస్సెల్, లాఫ్టీ ఈటన్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ గెలుపుతో జింబాబ్వే తొలి దశ మ్యాచ్లు పూర్తి చేసుకొని 4 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా కూడా 4 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. నమీబియా 2 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. సౌతాఫ్రికా, నమీబియా చివరి తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ ఫలితంపై ఫైనల్ బెర్త్లు ఆధారపడి ఉంటాయి.


