Sunil Chhetri: 'వాళ్ల‌ను చూస్తే అసూయ‌గా ఉంది' | Sunil Chhetri-Says-Feel-Little-Bit-Jealous-But Happy-Boys-Playing-Brazil | Sakshi
Sakshi News home page

Sunil Chhetri: 'వాళ్ల‌ను చూస్తే అసూయ‌గా ఉంది'

Aug 30 2026 9:32 PM | Updated on Aug 30 2026 9:59 PM

Sunil Chhetri-Says-Feel-Little-Bit-Jealous-But Happy-Boys-Playing-Brazil

Photo Credit: Twitter

భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు సెప్టెంబ‌ర్‌-అక్టోబ‌ర్ మ‌ధ్య‌లో  కోల్‌క‌తాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేదిక‌గా బ్రెజిల్‌, ప‌నామా, ఉరుగ్వేతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ‌నున్న నేప‌థ్యంలో భార‌త ఫుట్‌బాల్ దిగ్గ‌జం సునీల్ ఛెత్రి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ఇప్ప‌టి భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టును చూస్తే త‌న‌కు అసూయగా ఉంద‌ని, అయినా వారి చ‌ర్య ప‌ట్ల సంతోషంగా ఉన్న‌ట్లు అభిప్రాయం వ్య‌క్తం చేశాడు. 

ఏఎన్ఐకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సునీల్ ఛెత్రి మాట్లాడుతూ.. "మ‌న భార‌త జ‌ట్టు కుర్రాళ్లు బ్రెజిల్‌, ఉరుగ్వే, ప‌నామాల‌తో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడబోతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంచెం అసూయ‌గా కూడా ఉంది. ఎందుకంటే 26 ఏళ్ల ప్రొఫెష‌నల్ కెరీర్‌లో కానీ, 20 ఏళ్ల భార‌త జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించిన‌ప్పుడు కూడా ఎప్పుడూ నాకు ఈ అవ‌కాశం రాలేదు. 

అది అసూయ క‌లిగించింద‌ని చెప్పాను త‌ప్ప వేరే ఉద్దేశంతో కాదు. ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడ‌నున్న నేప‌థ్యంలో ఆట‌గాళ్లు ఫిట్‌గా ఉండి, ప‌ట్టుద‌ల‌తో ఆడాల‌ని కోర‌కుంటున్నా. ఈ అవ‌కాశాన్ని మ‌న కుర్రాళ్లు పూర్తిగా స‌ద్వినియోగం చేసుకుంటార‌ని ఆకాంక్షిస్తున్నా" అని సునీల్ ఛెత్రి చెప్పుకొచ్చాడు.

ఇక జ‌ట్టు ఎంపిక‌పై మీ అభిప్రాయం ఏంట‌ని సునీల్ ఛెత్రిని అడ‌గ్గా.. "దీనికి కోచ్ సమాధానం చెప్పాలి. నేను ఇప్పుడు అందరిలాగా ఒక ఫుట్‌బాల్‌ అభిమాని మాత్ర‌మే. అయితే ఒకటి మాత్రం స్ప‌ష్టంగా చెప్ప‌గ‌ల‌ను. జ‌ట్టు అవ‌స‌రాల‌కు అనుగుణంగానే జ‌ట్టును ఎంపిక చేసిన‌ట్లు అనిపిస్తుంది. ప్ర‌స్తుతం జ‌ట్టులోని ఆట‌గాళ్ల‌పై నాకు పూర్తి న‌మ్మ‌కం ఉంది. ఇది వారి స‌మ‌యం. 20 ఏళ్ల క్రితం నాకు అవ‌కాశం ల‌భించిన‌ట్లే, ఇప్పుడు ఈ కుర్రాళ్ల‌కు ల‌భించింది. వాళ్లు దానిని స‌ద్వినియోగం చేసుకోవాలి." అని తెలిపాడు.

ఇక భార‌త ఫుట్‌బాల్ జ‌ట్టు తొలుత బెంగ‌ళూరులోని కంఠీర‌వ స్టేడియం వేదిక‌గా ప‌నామాతో ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడ‌నుంది. ఆ త‌ర్వాత అక్టోబ‌ర్ 3న కోల్‌క‌తాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఐదుసార్లు ఫిఫా చాంపియ‌న్ బ్రెజిల్‌తో ఆడ‌నుంది. ఇక చివ‌ర‌గా అక్టోబ‌ర్ 6న రెండుసార్లు ఫిఫా చాంపియ‌న్ ఉరుగ్వేతో ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడ‌నుంది.

భార‌త్ త‌ర‌ఫున దిగ్గ‌జ ఫుట్‌బాల‌ర్‌గా పేరుపొందిన సునీల్ ఛెత్రి జాతీయ జ‌ట్టుకు 157 మ్యాచ్‌లాడి 95 గోల్స్ సాధించాడు. భార‌త్ త‌ర‌ఫున అత్య‌ధిక మ్యాచ్‌లు ఆడిన ఆట‌గాడిగా రికార్డుల‌కెక్కిన సునీల్ ఛెత్రి  భార‌త్ త‌ర‌ఫున ఆల్‌-టైమ్ టాప్ గోల్ స్కోర‌ర్‌గా కొన‌సాగుతున్నాడు. 2024లో అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్‌కు వీడ్కోలు ప‌లికిన ఛెత్రి అంత‌ర్జాతీయ గోల్ స్కోర‌ర్ల ఆల్‌టైమ్ జాబితాలో రొనాల్డో, మెస్సీ, అలీ దాయీల త‌ర్వాత నాలుగో స్థానంలో ఉన్నాడు.

Read: లార్డ్స్‌లో పాక్ బౌల‌ర్ అరుదైన ఫీట్‌.. అక్ర‌మ్ వ‌ల్ల కాలేదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement