source: X
భారత వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ శుభ్మన్ గిల్ స్వరాష్ట్రంలో జరుగుతున్న షేర్ ఎ పంజాబ్ టీ20 లీగ్లో చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలోకి ఆలస్యం ఎంట్రీ ఇచ్చిన అతడు, వరుసగా రెండో మ్యాచ్లో (ఫాజిల్కా ఫాల్కన్స్ కెప్టెన్) దుమ్మురేపాడు.
నిన్న లుథియానా లయన్స్తో జరిగిన మ్యాచ్లో 21 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 40 పరుగులు చేసిన గిల్.. ఇవాళ అమృత్సర్ సూర్మాస్తో జరుగుతున్న మ్యాచ్లో మరింత రెచ్చిపోయి 35 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు.
ఇక్కడ కొసమెరుపు ఏంటంటే.. గిల్ తన టీమిండియా సహచరుడు, బెస్ట్ ఫ్రెండ్ అయిన అభిషేక్ శర్మ (అమృత్సర్ సూర్మాస్ కెప్టెన్) బౌలింగ్లో (నమన్ ధిర్కు క్యాచ్ ఇచ్చి) ఔటయ్యాడు. రెగ్యులర్గా బ్యాటింగ్లో ఓపెనింగ్ చేసే అభిషేక్ ఈ మ్యాచ్లో బౌలింగ్లో ఓపెనింగ్ చేశాడు.
ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన అతడు.. తన కోటా 4 ఓవర్లు పూర్తి చేసి 37 పరుగులకు 2 వికెట్లు తీశాడు. అభిషేక్ గిల్ వికెట్తో పాటు అన్షుల్ చౌదరి వికెట్ తీశాడు.
ఈ మ్యాచ్లో అమృత్సర్ సూర్మాస్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. 13.4 ఓవర్లు ముగిసే సమయానికి ఆ జట్టు 4 వికెట్లు కోల్పోయి 125 పరుగులు చేసింది. గిల్ (67), విహాన్ మల్హోత్రా (5), అన్షుల్ చౌదరి (0), ప్రన్షు ప్రతాప్ (40) ఔట్ కాగా.. సన్వీర్ సింగ్ (7), ఎయిష్ రావ్ (0) క్రీజ్లో ఉన్నారు. సూర్మాస్ బౌలర్లలో నమన్ ధిర్, సాహిల్ ఖాన్ కూడా తలో వికెట్ తీశారు.
కాగా, షేర్ ఎ పంజాబ్ టోర్నీలో గిల్, అభిషేక్తో పాటు ప్రభ్సిమ్రన్ సింగ్, అర్షదీప్ సింగ్ తదితర టీమిండియా ప్లేయర్లు పాల్గొంటున్నారు. 6 జట్లు పాల్గొనే ఈ టోర్నీలో ప్రస్తుతం రమన్సింగ్ నేతృత్వంలోని మొహాలీ కింగ్స్ టాప్ ప్లేస్లో ఉంది. గిల్ సారథ్యంలోని ఫాల్కన్స్ నాలుగులో, అభిషేక్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న సూర్మాస్ చివరి స్థానంలో ఉన్నాయి.
చదవండి: శుభ్మన్ గిల్ మెరుపులు.. ఒక్క పరుగు తేడాతో విజయం


