‘అప్పటికప్పుడు ఆటను మార్చుకోవాలి’ | Sachin Tendulkar advice to the Indian team | Sakshi
Sakshi News home page

‘అప్పటికప్పుడు ఆటను మార్చుకోవాలి’

Jun 20 2025 1:51 AM | Updated on Jun 20 2025 1:51 AM

Sachin Tendulkar advice to the Indian team

ఇంగ్లండ్‌లో పరిస్థితులు భిన్నం 

భారత జట్టుకు సచిన్‌ సూచన   

లీడ్స్‌: ఇంగ్లండ్‌ గడ్డపై భారత్‌ మెరుగైన ఫలితం సాధించాలంటే బ్యాటర్లు ఒకే తరహా శైలికి కట్టుబడి ఉండరాదని భారత క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌ మైదానాల్లో పరిస్థితులు వేగంగా మారిపోతుంటాయని, దానికి అనుగుణంగా తమ బ్యాటింగ్‌ ను కూడా మార్చుకోవాలని అతను సూచించాడు. ‘నా ఆట ఇలాగే ఉంటుంది. నేను ఇలాగే ఆడతాను అనే వన్‌వే ట్రాఫిక్‌ ఇంగ్లండ్‌లో పనికి రాదు. ఇక్కడి పరిస్థితులను కొద్దిగా గౌరవించాల్సి ఉంటుంది. వాటికి అనుగుణంగా తమ ఆటను మార్చుకోవాలనే ఆలోచనలు మనసులో సాగుతూనే ఉండాలి. అప్పుటే ఆటపై పట్టు చిక్కి అంతా చక్కబడుతుంది. 

ఎప్పుడు దూకుడు పెంచాలో, ఎప్పుడు డిఫెన్స్‌ ఆడాలో తెలియాలి. లేదంటే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది’ అని సచిన్‌ వివరించాడు. అయితే ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో ఆడిన అనుభవం జట్టులో అందరికీ ఉందని, వాటినుంచి నేర్చుకున్న విషయాలను మెరుగుపర్చుకుంటే ఇక్కడా మంచి ఫలితాలు వస్తాయని అతను అన్నాడు. భారత కెప్టెన్‌గా తొలి సిరీస్‌ ఆడనున్న శుబ్‌మన్‌ గిల్‌కు కూడా సచిన్‌ పలు సలహాలు ఇచ్చాడు. అతను బయటి విషయాలను పట్టించుకోరాదని, తన నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని దిగ్గజ బ్యాటర్‌ సూచించాడు. 

‘కెప్టెన్‌గా గిల్‌కు కొంత సమయం ఇవ్వడంతో పాటు అందరూ అతనికి అండగా కూడా నిలవాలి. భారత కెప్టెన్‌ అంటే తీవ్రమైన ఒత్తిడి ఉండే బాధ్యత. ఇలా చేయాలి అలా చేయాలి అని చాలా మంది చెబుతూ ఉంటారు. అభిప్రాయాలు చెప్పే హక్కు బయటి నుంచి ఎవరికైనా ఉంటుంది. ఇవన్నీ గిల్‌ పట్టించుకోకూడదు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో చర్చించిన వ్యూహాలను మైదానంలో అమలయ్యేలా చూడాలి’ అని సచిన్‌ వ్యాఖ్యానించాడు. 

‘అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ’ ఆవిష్కరణ..
భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగే టెస్టు సిరీస్‌కు ‘అండర్సన్‌–టెండూల్కర్‌ ట్రోఫీ’గా పేరు పెట్టారు. ఈ ట్రోఫీని గురువారం ఆవిష్కరించారు. అత్యధిక టెస్టులు ఆడిన ఆటగాళ్లుగా సచిన్‌ (200), అండర్సన్‌ (188) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్‌ (15,921) పేరిట ఉండగా... అత్యధిక వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంతో (704 వికెట్లు) అండర్సన్‌ కెరీర్‌ ముగించాడు.

 వీరిద్దరి పేర్లను ట్రోఫీకి పెట్టి ఈసీబీ, బీసీసీఐ సముచితంగా గౌరవించాయి. మరోవైపు ఇప్పటి వరకు ట్రోఫీకి ‘పటౌడీ’ పేరు ఉండేది. ఇప్పుడు విజేతగా నిలిచిన జట్టు కెపె్టన్‌కు ‘పటౌడీ మెడల్‌’ అందజేస్తారు. పేరు మార్పు విషయంలో తాను పటౌడీ కుటుంబంతో స్వయంగా మాట్లాడానని ... ఏదో రూపంలో వారి గౌరవం కొనసాగేలా తాను ప్రయత్నిస్తానని వారితో చెప్పినట్లు సచిన్‌ వెల్లడించాడు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement