భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును ఇవాళ (జూన్ 23) అందుకున్నాడు. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు.
ఈ ఏడాది జనవరిలోనే రోహిత్తో పాటు భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు కూడా పద్మశ్రీ ప్రకటించారు. హర్మన్ప్రీత్ గత నెలలో అవార్డు అందుకోగా, తాజాగా రోహిత్ ఈ గౌరవాన్ని స్వీకరించాడు.
టీమిండియాకు అందించిన సేవలకు గుర్తింపు
గత కొన్నేళ్లుగా భారత జట్టుకు రోహిత్ అందించిన సేవలు, అతని నాయకత్వంలో జట్టు సాధించిన విజయాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పురస్కారం ప్రకటించింది. రోహిత్ కెప్టెన్సీలో భారత్ 2024 టీ20 ప్రపంచకప్ను గెలుచుకోవడంతో పాటు, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.
దిగ్గజాల సరసన రోహిత్
పద్మశ్రీ అందుకున్న భారత క్రికెట్ ప్రముఖుల జాబితాలో ఇప్పుడు రోహిత్ కూడా చేరాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, రాహుల్ ద్రవిడ్, గౌతమ్ గంభీర్, కపిల్ దేవ్, ఎంఎస్ ధోని వంటి దిగ్గజాలు ఈ గౌరవాన్ని అందుకున్నారు.
ఇంగ్లండ్ పర్యటనకు సిద్ధం
హామ్స్ట్రింగ్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రోహిత్ త్వరలో ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్నాడు. శుభ్మన్ గాల్ నాయకత్వంలోని భారత జట్టు జూలై 14 నుంచి 19 వరకు జరిగే మూడు వన్డేల సిరీస్లో ఇంగ్లండ్తో తలపడనుంది. ఆ సిరీస్కు ఎంపికైన జట్టులో రోహిత్ కూడా చోటు దక్కించుకున్నాడు.


