పుజారాకు అరుదైన గౌరవం | Pujara, Bates, Devine among new MCC Honorary life members | Sakshi
Sakshi News home page

పుజారాకు అరుదైన గౌరవం

Jun 29 2026 7:07 AM | Updated on Jun 29 2026 7:07 AM

Pujara, Bates, Devine among new MCC Honorary life members

భారత టెస్టు క్రికెట్‌పై తనదైన ముద్ర వేసిన ఛతేశ్వర్‌ పుజారాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మకమైన Marylebone Cricket Club అతడికి గౌరవ జీవిత సభ్యత్వాన్ని (Honorary Life Membership) అందించింది. పుజారాతో పాటు న్యూజిలాండ్ మహిళా క్రికెట్ దిగ్గజాలు సూజీ బేట్స్‌, సోఫీ డివైన్‌.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మెల్‌ జోన్స్‌, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ తమీమ్‌ ఇక్బాల్‌ కూడా ఈ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు.

37 ఏళ్ల పుజారా భారత్ తరఫున 103 టెస్టులు ఆడి 7,195 పరుగులు చేశారు. ఇందులో 19 సెంచరీలు ఉన్నాయి. విదేశీ పర్యటనల్లో భారత్ సాధించిన ఎన్నో చారిత్రక విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 21 వేలకుపైగా పరుగులు సాధించిన పుజారా ప్రస్తుతం వ్యాఖ్యాతగా కొనసాగుతున్నారు.

ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సుజీ బేట్స్, సోఫీ డివైన్‌లకు కూడా ఎంసీసీ ఈ గౌరవాన్ని ప్రకటించింది. మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా బేట్స్ కెరీర్ ముగించగా, డివైన్ 8 వేలకుపైగా పరుగులు, 240కుపైగా వికెట్లు తీసిన అత్యుత్తమ ఆల్‌రౌండర్లలో ఒకరిగా నిలిచారు. ఆమె నాయకత్వంలో న్యూజిలాండ్ 2024 మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది.

రెండుసార్లు మహిళల ప్రపంచకప్ విజేతగా నిలిచిన మెల్ జోన్స్, అనంతరం ప్రముఖ వ్యాఖ్యాతగా, మహిళల క్రికెట్ అభివృద్ధికి విశేష సేవలు అందించారు. మరోవైపు బంగ్లాదేశ్ తరఫున 13 వేలకుపైగా అంతర్జాతీయ పరుగులు చేసిన తమీమ్ ఇక్బాల్ ఇటీవల బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.

సభ్యత్వ ప్రకటన సందర్భంగా ఎంసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రాబ్‌ లాసన్‌ మాట్లాడుతూ, "క్రికెట్‌కు జీవితాంతం విశేష సేవలు అందించిన ఈ ఐదుగురు దిగ్గజాలను గౌరవ జీవిత సభ్యులుగా స్వాగతించడం ఎంతో ఆనందంగా ఉంది" అని పేర్కొన్నారు.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement