టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ నిష్క్ర‌మ‌ణ‌ | Pakistan Women-Became-1st-Team-Eliminated From-2026 T20 World Cup | Sakshi
Sakshi News home page

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి పాకిస్తాన్ నిష్క్ర‌మ‌ణ‌

Jun 21 2026 9:26 AM | Updated on Jun 21 2026 11:17 AM

Pakistan Women-Became-1st-Team-Eliminated From-2026 T20 World Cup

మ‌హిళ‌ల టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2026 నుంచి నిష్క్ర‌మించిన తొలి జ‌ట్టుగా పాకిస్తాన్ నిలిచింది. బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మి చ‌విచూసిన పాకిస్తాన్‌కు టోర్నీలో ఇది హ్యాట్రిక్ ప‌రాజ‌యం. ఇంత‌క‌ముందు భార‌త్‌, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టు తాజాగా శ‌నివారం బంగ్లాదేశ్ చేతిలో ఓట‌మితో నాకౌట్ ద‌శ‌కు చేర‌కుండానే టోర్నీ నుంచి నిష్క్ర‌మించింది. 

అంత‌క‌ముందు ఆస్ట్రేలియా జ‌ట్టు నెద‌ర్లాండ్స్‌పై భారీ విజ‌యంతో పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌కు చేరుకోవ‌డంతో పాకిస్తాన్‌తో పాటు నెద‌ర్లాండ్స్ కూడా మూడు ఓట‌ముల‌తో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి నిష్క్ర‌మించింది. సౌతాంప్టన్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 23 ప‌రుగుల తేడాతో పాకిస్తాన్‌పై విజ‌యం సాధించింది. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. కెప్టెన్‌ నిగార్‌ సుల్తానా (36), శోభన మోస్తరీ (22) ఓ మోస్తరు స్కోర్లు చేయగా.. ఆఖర్లో షోర్నా అక్తెర్‌ (39 నాటౌట్‌) బ్యాట్‌ ఝులిపించింది.  అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో పాక్‌ ఆదిలో బాగా ఆడినా, మధ్యలో లయ కోల్పోయింది. ఆ జట్టు ఓపెనర్లు మునీబా అలీ (25), గుల్‌ ఫెరోజా (23) తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించగా.. ఆతర్వాత పాక్‌ 26 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లు కోల్పోయి ఓటమి బాట పట్టింది.

పాకిస్తాన్ క్రికెట్‌కు ప్ర‌స్తుతం సంధికాలం న‌డుస్తోంది. అటు పురుషులు.. ఇటు మ‌హిళ‌ల జ‌ట్టు టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో నాకౌట్ చేర‌డంలో విఫ‌ల‌మ‌య్యాయి. ఫిబ్ర‌వ‌రిలో జరిగిన పురుషుల టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో పాకిస్తాన్ సూప‌ర్‌-8 ద‌శ‌లోనే ఇంటిబాట ప‌ట్టింది. ఆ త‌ర్వాత బంగ్లాదేశ్ చేతిలో టెస్టు సిరీస్‌లో క్లీన్‌స్వీప్ అయింది. 

తాజాగా మ‌హిళ‌ల జ‌ట్టు కూడా పురుషుల జట్టునే అనుస‌రించింది. టీ20 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ చేతుల్లో హ్యాట్రిక్ ఓట‌ములు చ‌విచూసి టోర్నీ నుంచి భారంగా నిష్క్ర‌మించింది. 2009 ఆరంభ టీ20 ప్ర‌పంచ‌క‌ప్ నుంచి ప్ర‌తీసారి బ‌రిలోకి దిగిన పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టు ఏనాడు ఫ‌స్ట్ రౌండ్ దాటింది లేదు. ఈసారి కూడా ఆ చెత్త‌ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డంలో విఫ‌ల‌మైంది.

మ‌రోవైపు ఇదే గ్రూప్‌లో ఉన్న భారత మ‌హిళ‌ల జ‌ట్టు మాత్రం రెండు విజ‌యాల‌తో ఆసీస్ త‌ర్వాతి స్థానంలో ఉంది. ఇవాళ సౌతాఫ్రికాతో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో గెలిచి నాకౌట్‌కు చేరుకోవాల‌ని హ‌ర్మ‌న్ సేన ఉవ్విళ్లూరుతోంది.

 

చదవండి: 11 ఫోర్లు, 13 సిక్స‌ర్ల‌తో విధ్వంసం.. టీ20 క్రికెట్‌లో సరికొత్త రికార్డు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement