మహిళల ఆసియాకప్-2026లో హైవోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్దమైంది. ఈ టోర్నీలో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా చిరకాల ప్రత్యర్ధులు భారత్-పాకిస్తాన్ జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్లలో గెలిచి మంచి జోష్లో ఉన్న హర్మన్ సేన.. పాక్తో పోరులోనూ సత్తాచాటాలని పట్టుదలతో ఉంది.
మరోవైపు తమ మొదటి మ్యాచ్లో థాయ్లాండ్ను ఓడించిన పాకిస్తాన్.. భారత్లో మ్యాచ్లో కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో ప్రీ మ్యాచ్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన పాక్ ఓపెనర్ ఆయేషా జాఫర్ కీలక వ్యాఖ్యలు చేసింది. టీమిండియాతో మ్యాచ్ కోసం తామేమి ప్రత్యేక వ్యూహాలు రచించడం లేదని జాఫర్ తెలిపింది.
"భారత్-పాక్ మ్యాచ్ అంటే భారీ అంచనాలు ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ మా దృష్టిలో ఇదీ ఒక సాధారణ మ్యాచ్ లాంటిదే. ఈ టోర్నీలో ఇది మాకు రెండో మ్యాచ్. ఇందులో కూడా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి విజయం సాధించడమే మా లక్ష్యం.
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా రాణించేందుకు శ్రమిస్తున్నాం. ముఖ్యంగా ఫీల్డింగ్లో ఎలాంటి పొరపాట్లకూ తావివ్వకూడదని మా మెంటార్ స్పష్టం చేశారు" అని ఆయేషా విలేకరుల సమావేశంలో పేర్కొంది.
కాగా వైట్బాల్ క్రికెట్లో పాకిస్తాన్పై టీమిండియాకు అద్భుతమైన రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 17 టీ20లు జరగగా.. భారత్ 14 మ్యాచ్లలో విజయం సాధించగా, పాక్ కేవలం మూడింట మాత్రమే గెలుపొందింది. వన్డేల్లో అయితే 12 మ్యాచ్లు జరగగా.. మొత్తం అన్నింటిలోనూ టీమిండియానే గెలిచింది.
చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!


