
ముంబై ఇండియన్స్పై 12 పరుగులతో సూపర్ జెయింట్స్ విజయం
మార్ష్, మార్క్రమ్ అర్ధసెంచరీలు
బౌలింగ్లో రాణించిన దిగ్వేశ్ రాఠీ
లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ముంబై ఇండియన్స్ విజయలక్ష్యం 204 పరుగులు... నమన్, సూర్యకుమార్ చెలరేగినప్పుడు గెలుపు సునాయాసం అనిపించింది... చివర్లో 2 ఓవర్లో 29 పరుగులు చేయాల్సి ఉన్నా హార్దిక్ పాండ్యా కొట్టగలడని అనిపించింది... కానీ లక్నో మ్యాచ్ను కాపాడుకోగలిగింది.
19వ ఓవర్లో శార్దుల్ 7 పరుగులే ఇవ్వగా, ఆఖరి ఓవర్లో పదునైన బౌలింగ్తో అవేశ్ ఖాన్ 9 పరుగులే ఇచ్చాడు. దాంతో ముంబైకి ఓటమి తప్పలేదు. నలుగురు లక్నో బౌలర్లు 40కి పైగా పరుగులు ఇవ్వగా... స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీ 21 పరుగులే ఇవ్వడటం చివరకు ఫలితంపై ప్రభావం చూపించింది. అంతకుముందు మిచెల్ మార్ష్, మార్క్రమ్ బ్యాటింగ్తో 200 పరుగులు దాటిన లక్నో ప్రత్యర్థికి సవాల్ విసిరింది.
లక్నో: ఐపీఎల్ సీజన్లో సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్కు తొలి విజయం దక్కింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన పోరులో లక్నో 12 పరుగుల తేడాతో ఐదుసార్లు చాంపియన్ ముంబై ఇండియన్స్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. మిచెల్ మార్ష్ (31 బంతుల్లో 60; 9 ఫోర్లు, 2 సిక్స్లు), ఎయిడెన్ మార్క్రమ్ (38 బంతుల్లో 53; 2 ఫోర్లు, 4 సిక్స్లు) అర్ధ సెంచరీలు చేయగా, ఆయుష్ బదోని (19 బంతుల్లో 30; 4 ఫోర్లు) రాణించాడు.
హార్దిక్ పాండ్యా (5/36) తన టి20 కెరీర్లో తొలిసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 5 వికెట్లకు 191 పరుగులే చేయగలిగింది. సూర్యకుమార్ యాదవ్ (43 బంతుల్లో 67; 9 ఫోర్లు, 1 సిక్స్), నమన్ ధీర్ (24 బంతుల్లో 46; 4 ఫోర్లు, 3 సిక్స్లు) రాణించారు.
పంత్ విఫలం...
లక్నోకు ఓపెనర్లు మార్ష్, మార్క్రమ్ శుభారంభం అందించారు. బౌల్ట్ వేసిన తొలి ఓవర్ నాలుగో బంతి మార్ష్ బ్యాట్ను తాకుతూ కీపర్ చేతుల్లో పడింది. అయితే దీనిని ముంబై బృందం గుర్తించక అప్పీల్ చేయలేదు. దాంతో బతికిపోయిన మార్ష్ ఆ తర్వాత చెలరేగిపోయి బౌల్ట్ తర్వాతి ఓవర్లో 6, 4 కొట్టాడు. అనంతరం అశ్వని ఓవర్లో మార్ష్ వరుసగా 6, 4, 2, 2, 4, 4 బాదగా, వైడ్తో కలిపి మొత్తం 23 పరుగులు వచ్చాయి.
ఈ క్రమంలో 27 బంతుల్లో మార్ష్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, పవర్ప్లేలో లక్నో 69 పరుగులు సాధించింది. ఎట్టకేలకు పుతూర్... మార్ష్ను వెనక్కి పంపించాడు. మార్ష్, మార్క్రమ్ తొలి వికెట్కు 42 బంతుల్లోనే 76 పరుగులు జోడించారు. ఫామ్లో ఉన్న నికోలస్ పూరన్ (12) ఎక్కువసేపు నిలబడలేకపోగా, రిషభ్ పంత్ (2) వరుసగా నాలుగో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు. ఈ దశలో బదోని, మార్క్రమ్ కలిసి ఇన్నింగ్స్ను నడిపించారు.
సాంట్నర్ ఓవర్లో బదోని వరుసగా 3 ఫోర్లు కొట్టగా, ఎట్టకేలకు 17వ ఓవర్లో మార్క్రమ్ అర్ధసెంచరీ (34 బంతుల్లో) పూర్తయింది. వీరిద్దరు నాలుగో వికెట్కు 31 బంతుల్లో 51 పరుగులు జత చేశారు. చివర్లో డేవిడ్ మిల్లర్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడుతో స్కోరు 200 దాటింది.
సూర్య హాఫ్ సెంచరీ...
ఛేదనలో ముంబై ఆరంభంలోనే జాక్స్ (5), రికెల్టన్ (10) వికెట్లు కోల్పోయింది. అయితే నమన్, సూర్య భాగస్వామ్యంతో స్కోరు దూసుకుపోయింది. ముఖ్యంగా నమన్ మెరుపు బ్యాటింగ్తో చెలరేగిపోయాడు. ఆకాశ్దీప్ ఓవర్లో అతను వరుసగా 6, 6, 4, 4 బాదాడు. దాంతో పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 64 పరుగులకు చేరింది. అయితే రాఠీ బౌలింగ్లో నమన్ బౌల్డ్ కావడంతో 69 పరుగుల (35 బంతుల్లో) మూడో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది.

ఆ తర్వాతా జోరు సాగించిన సూర్య 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 24 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య అవుట్ కాగా...షాట్లు ఆడటంలో బాగా ఇబ్బంది పడిన తిలక్వర్మ (23 బంతుల్లో 25; 2 ఫోర్లు) ‘రిటైర్డ్ అవుట్’గా తప్పుకున్నాడు. చివర్లో హార్దిక్ పాండ్యా (16 బంతుల్లో 28 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎంతగా ప్రయత్నించినా ముంబైకి ఓటమి తప్పలేదు. 17వ, 18వ ఓవర్లలో కలిపి 23 పరుగులు వచ్చినా... చివరి 2 ఓవర్లలో 29 పరుగులు చేయడంలో ముంబై విఫలమైంది.
స్కోరు వివరాలు
లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్స్: మార్ష్ (సి అండ్ బి) పుతూర్ 60; మార్క్రమ్ (సి) బావా (బి) పాండ్యా 53; పూరన్ (సి) చహర్ (బి) పాండ్యా 12; పంత్ (సి) (సబ్) బాష్ (బి) పాండ్యా 2; బదోని (సి) రికెల్టన్ (బి) అశ్వని 30; మిల్లర్ (సి) నమన్ (బి) పాండ్యా 27; సమద్ (సి) నమన్ (బి) బౌల్ట్ 4; శార్దుల్ (నాటౌట్) 5; ఆకాశ్దీప్ (సి) సాంట్నర్ (బి) పాండ్యా 0; అవేశ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 203. వికెట్ల పతనం: 1–76, 2–91, 3–107, 4–158, 5–173, 6–182, 7–200, 8–200. బౌలింగ్: బౌల్ట్ 3–0–28–1, దీపక్ చహర్ 2–0–23–0, అశ్వని కుమార్ 3–0–39–1, సాంట్నర్ 4–0–46–0, విఘ్నేశ్ పుతూర్ 4–0–31–1, హార్దిక్ పాండ్యా 4–0–36–5.
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: జాక్స్ (సి) బిష్ణోయ్ (బి) ఆకాశ్దీప్ 5; రికెల్టన్ (సి) బిష్ణోయ్ (బి) శార్దుల్ 10; నమన్ ధీర్ (బి) రాఠీ 46; సూర్యకుమార్ (సి) సమద్ (బి) అవేశ్ 67; తిలక్వర్మ (రిటైర్డ్ అవుట్) 25; పాండ్యా (నాటౌట్) 28; సాంట్నర్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 191. వికెట్ల పతనం: 1–11, 2–17, 3–86, 4–152, 5–180. బౌలింగ్: శార్దుల్ ఠాకూర్ 4–0–40–1, ఆకాశ్దీప్ 4–0–46–1, అవేశ్ ఖాన్ 4–0–40–1, దిగ్వేశ్ రాఠీ 4–0–21–1, రవి బిష్ణోయ్ 4–0–40–0
రోహిత్ శర్మ దూరం
ముంబై ఓపెనర్ రోహిత్ శర్మ లక్నోతో మ్యాచ్లో ఆడలేదు. గురువారం ప్రాక్టీస్ సందర్భంగా అతని మోకాలికి గాయమైంది. దాంతో అతను ఈ పోరు నుంచి తప్పుకున్నాడు. రోహిత్ స్థానంలో రాజ్ బావాకు టీమ్ అవకాశం కల్పించింది.
ఐపీఎల్లో నేడు
చెన్నై X ఢిల్లీ
వేదిక: చెన్నై
మధ్యాహ్నం 3: 30 గంటల నుంచి
పంజాబ్ X రాజస్తాన్
వేదిక: ముల్లాన్పూర్
రాత్రి 7: 30 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, జియో హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం