
జైస్వాల్ (Photo Courtesy: BCCI/IPL)
ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి టీమిండియాకు ఆడే స్థాయికి చేరుకున్న ఆటగాళ్లలో యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal) ఒకడు. ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ తన అద్భుత ఆట తీరుతో టెస్టుల్లో భారత జట్టు ఓపెనర్గా పాతుకుపోయాడు.
అరంగేట్రంలోనే శతక్కొట్టిన జైసూ.. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 19 టెస్టుల్లో 1798 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు శతకాలతో పాటు.. రెండు డబుల్ సెంచరీలు కూడా విశేషం. టెస్టుల తర్వాత టీ20లలోనూ అరంగేట్రం చేసిన జైస్వాల్.. ఇప్పటికి 23 మ్యాచ్లు పూర్తి చేసుకుని 723 పరుగులు సాధించాడు. అయితే, దాదాపు ఏడాది కాలంగా మళ్లీ టీ20 జట్టులో అతడికి చోటు దక్కలేదు.
మరోసారి విఫలం
గతేడాది ఐపీఎల్లోనూ యశస్వి జైస్వాల్ స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. రాజస్తాన్ రాయల్స్ తరఫున పదహారు ఇన్నింగ్స్లో కలిపి 435 పరుగులు చేయగలిగాడు. ఇక ఐపీఎల్-2025 (IPL 2025)లో మాత్రం ఇంత వరకు తన మార్కు చూపలేకపోయాడు. తాజాగా గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లోనూ విఫలమయ్యాడు.
అహ్మదాబాద్లో బుధవారం జరిగిన ఈ మ్యాచ్లో రాయల్స్ ఓపెనింగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ ఏడు బంతులు ఎదుర్కొని కేవలం ఆరు పరుగులే చేశాడు. మొత్తంగా ఈ సీజన్లో ఇప్పటి వరకు ఐదు మ్యాచ్లు ఆడిన ఈ లెఫ్టాండర్ మొత్తంగా 107 (1, 29, 4, 67, 6 )పరుగులే చేశాడు. అంతకు ముందు ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ టెస్టు సిరీస్లోనూ జైసూ తన స్థాయి ప్రదర్శన కనబరచలేకపోయాడు.
తొలి టెస్టులో సెంచరీ (161), ఆఖరి టెస్టులో హాఫ్ సెంచరీలు (82, 84) మినహా.. ఆ తర్వాత పెద్దగా రాణించలేదు. తర్వాత రంజీ బరిలో దిగి విఫలమయ్యాడు. ఇటీవల స్వదేశంలో ఇంగ్లండ్తో సిరీస్ సందర్భంగా వన్డేల్లో ఎంట్రీ ఇచ్చి జైస్వాల్.. అరంగేట్రంలోనే తేలిపోయాడు. తన మొదటి వన్డేలో కేవలం పదిహేను పరుగులే చేశాడు.
పృథ్వీ షాను చూడు.. మనకూ అదే గతి పట్టవచ్చు..
ఈ పరిణామాల నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ బసిత్ అలీ యశస్వి జైస్వాల్ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశాడు. ‘‘అతడి కడుపు నిండిపోయింది. అంటే.. ఇప్పటి వరకు సాధించిన దానితో సంతృప్తి పడిపోయాడు. జైస్వాల్ ప్రస్తుతం క్రికెట్పై ఏమాత్రం దృష్టి పెట్టడం లేదు.
అతడికి ఇదే నా సందేశం.. క్రికెట్ను నిన్ను గొప్ప స్థాయికి చేర్చగలదు. అదే సమయంలో.. అదే రీతిలో ఏడిపించగలదు కూడా! ఒక్కసారి పృథ్వీ షా పరిస్థితి చూడు. ఇప్పటికైనా మునుపటిలా క్రికెట్ను ప్రేమించు. అదే ప్యాషన్తో మళ్లీ మైదానంలో అడుగుపెట్టు’’ అని బసిత్ అలీ జైసూకు సూచించాడు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా.. జైస్వాల్ స్థానం గల్లంతు కావడం ఖాయమని పేర్కొన్నాడు.
విరాట్ కాస్త తొందరపడ్డాడు.. కానీ
భారత్లో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు కొదువలేదని.. ముఖ్యంగా టీ20 ఫార్మాట్లో కొత్త స్టార్లు పుట్టుకు వస్తున్నారు కాబట్టి జైసూ ఇప్పటికైనా జాగ్రత్తపడాలని బసిత్ అలీ సలహా ఇచ్చాడు. ఇక ఈ సందర్భంగా.. ‘‘అంతర్జాతీయ టీ20ల నుంచి వైదొలిగి రోహిత్, విరాట్ మంచి పని చేశారు.
నాకైతే విరాట్ కాస్త తొందరపడ్డాడు అనిపించింది. అయితే.. సరైన సమయంలో అతడు సరైన నిర్ణయమే తీసుకున్నాడు. ఇండియాలో ప్రతిభకు కొదువలేదు. యువ ఆటగాళ్లు దూసుకువస్తున్న తరుణంలో ఈ ఇద్దరు రిటైర్మెంట్ ప్రకటించి వారికి మార్గం సుగమం చేశారు’’ అని బసిత్ అలీ పేర్కొన్నాడు.
కాగా చిన్న వయసులోనే సత్తా చాటి భారత్కు అండర్-19 వరల్డ్కప్ అందించిన కెప్టెన్ పృథ్వీ షా.. టీమిండియా ఓపెనర్గా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వ్యక్తిగతంగానూ క్రమశిక్షణ లోపించి ఐపీఎల్ వేలంలో కూడా అమ్ముడుపోని స్థితికి దిగజారిపోయాడు.
చదవండి: అతడికి కాస్త మర్యాద నేర్పండి.. చీప్ జోకులు వద్దు: సెహ్వాగ్పై ఫ్యాన్స్ ఫైర్