మైదానంలో బ్యాట్ పట్టి దేశం మెచ్చే క్రికెటర్గా ఎదగాలని, అమ్మానాన్నల కళ్లలో ఆనందం చూడాలని ఆ అమ్మాయి ఎన్నో కలలు కనింది. కానీ సెలక్టర్లు తీసుకున్న నిర్ణయం ఆమె ఆశలను అడియాసలు చేసింది. జట్టులో చోటు దక్కలేదన్న మనస్తాపంతో.. కేవలం 17 ఏళ్లకే తన ఆశల ప్రయాణానికి ముగింపు పలుకుతూ ప్రాణాలు తీసుకుంది. ఈ విషాదకర సంఘటన నాగ్పూర్లోని బజాజ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని అకోలా జిల్లాకు చెందిన అదితి చౌఖాండే ఇటీవల ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. అయితే అదితికి తన చిన్నతనం నుంచి క్రికెట్పై మక్కువ ఎక్కువ. తన అన్నయ్యకు కూడా క్రికెట్ అంటే పిచ్చి. కానీ వారు నివసించే అకోలాలో మంచి క్రికెట్ అకాడమీలు లేకపోవడంతో, వారిద్దరూ రెండేళ్ల కిందట నాగపూర్కు మకాం మార్చారు.
వారి తండ్రి వృత్తి రీత్యా అకోలాలో ఉండిపోయినప్పటికి.. తల్లి మాత్రం పిల్లలతో పాటు నాగపూర్కు వెళ్లింది. అప్పటి నుంచి అదితి స్ధానికంగా ఓ క్రికెట్ ఆకాడమీలో శిక్షణపొందుతోంది. ఆమె గత రెండేళ్ల నుంచి కఠోర సాధన చేస్తూ.. క్రికెట్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కలలు కనేది. అయితే బుధవారం రాత్రి అదితి తల్లితో కలిసి భోజనం చేసిన అనంతరం తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.
ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి కుటుంబ సభ్యులు వెళ్లి చూడగా.. ఆమె ఫ్యాన్కు ఊరి వేసుకుని కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్ధలానికి చేరుకున్నారు. పోలీసులు ఆమె గదిలో ఒక సూసైడ్ నోట్ను స్వాధీనం చేసుకున్నారు. తాను పెద్ద జట్టుకు ఎంపిక కాకపోవడం వల్ల తల్లిదండ్రులను గర్వపడేలా చేయలేకపోతున్నానని అదితి అందులో తన బాధను వ్యక్తం చేసింది. అంతేకాకుండా తన అన్నయ్యను ఉద్దేశించి కూడా ఆ లెటర్లో ఆమె భావోద్వేంగా రాసుకొచ్చింది.
ప్రియమైన అన్నయ్యా.. నువ్వు నాకంటే చాలా బాగా ఆడతాడు. భవిష్యత్తులో గొప్ప క్రికెటర్ అవుతావు నేను నమ్ముతున్నా. . మన తల్లిదండ్రులు గర్వపడేలా చెయ్. నేను ఎంపిక కాలేకపోయినందుకు చాలా బాధగా ఉంది" అని ఆ లేఖలో పేర్కొంది. ఉన్నత స్థాయి జట్టులో చోటు దక్కకపోవడమే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని ఇన్స్పెక్టర్ చేతన్ చౌహాన్ తెలిపారు. కాగా ఇటీవల విదర్భ క్రికెట్ అసోసియేషన్ ఓ టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో ఆమెకు చోటు దక్కకపోవడమే ఇందుకు కారణమని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి.


