హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: నాగ్పూర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టును ఆధునీకరించే దిశగా హ్యాండోవర్ చేసుకున్నట్లు జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ (జీఎంఆర్ ఏరో) వెల్లడించింది. దీనితో సంస్థ చేతిలోని విమానాశ్రయాల సంఖ్య తొమ్మిదికి చేరుకుంది. వీటిలో కొన్ని కంపెనీ నిర్వహణలో ఉండగా, కొన్నింటిని అభివృద్ధి చేస్తోంది.
30 ఏళ్ల కన్సెషన్ వ్యవధిలో విమానాశ్రయాన్ని జీఎంఆర్ నాగ్పూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (జీఎన్ఐఏఎల్) దశలవారీగా అభివృద్ధి చేస్తుందని కంపెనీ చైర్మన్ జీబీఎస్ రాజు తెలిపారు. తొలి దశలో ఏటా ముప్పై లక్షల మంది ప్యాసింజర్ల స్థాయికి టెర్మినల్ని విస్తరించనున్నట్లు, దశలవారీగా 3 కోట్ల ప్రయాణికుల స్థాయికి పెంచనున్నట్లు వివరించారు. దీనికి సంబంధించి 2024లో మిహాన్ ఇండియాతో జీఎన్ఐఏఎల్ ఒప్పందం కుదుర్చుకుంది.


