విశాఖపట్నం జిల్లా: భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వం సుదూర ప్రాంతాల నుంచి తరలించిన ప్రజలకు శనివారం పాచిపోయిన ఉప్మా, బిర్యానీ, పులిహోర, ఉండలు కట్టిన పెరుగన్నం ప్యాకెట్లు అందించింది. ఆనందపురం మండలం పెద్దిపాలెంలో వీటిని శుక్రవారం రాత్రి 11 గంటలకు వండి వేడిగా ఉన్నప్పుడే డబ్బాలలో ప్యాకింగ్ చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఉదయం బ్రేక్ఫాస్ట్కు ఉప్మా అందించారు. రాత్రి ప్యాకింగ్ చేసిన ఉప్మా ఉదయానికి పాచిపోయింది. మధ్యాహ్నం అందించిన 150 గ్రాముల బిర్యానీ ప్యాకెట్లో మీల్మేకర్ తప్ప ఎలాంటి కూరగాయలు వాడలేదు. రాత్రి చేసింది కావడంతో బిర్యానీ కూడా పాచిపోయిన వాసన వచ్చింది. దీంతోపాటు అందించిన 100 గ్రాముల పెరుగన్నం కూడా ఉండలు ఉండలుగా మారడంతో తినడానికి ఎవరూ ఇష్టపడలేదు.


