
లీడ్స్: భారత్తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ తన మొదటి ఇన్నింగ్స్లో 465 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆదివారం మూడో రోజు ఆటలో 100.4 ఓవర్లో ఇంగ్లండ్ తన తొలి ఇన్నింగ్స్ ముగించింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఓలీ పోప్(106)సెంచరీతో మెరవగా, హారీ బ్రూక్(99) పరుగు దూరంలో సెంచరీ కోల్పోయాడు. ప్రసిద్ధ్ కిష్ణ వేసిన ఓవర్లో శార్దూల్ ఠాకూర్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు బ్రూక్. పరుగు దూరంలో శతకం కోల్పోవడంతో నిరాశగా పెవిలియన్ చేరాడు బ్రూక్.
అయితే అంతకుముందు ఓపెనర్ బెన్ డకెట్(62) హాఫ్ సెంచరీతో ఇంగ్లండ్కు మంచి ఆరంభాన్ని అందించాడు. పోప్తో కలిసి 122 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యాన్ని అందించాడు. ఆపై జోరూట్(28)తో కలిసి పోప్ మరో 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఇంగ్లండ్ పుంజుకుంది. అదే ఊపును కొనసాగించిన పోప్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పోప్కు టెస్టుల్లో 9వ సెంచరీగా నిలిచింది.
ఇదిలా ఉంచితే, జెమీ స్మిత్(40), క్రిస్ వోక్స్(38), బ్రైడన్ కార్స్(22)లు ఫర్వాలేదనిపించడంతో ఇంగ్లండ్ 450 పరుగుల మార్కును దాటింది. తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ ఆరు పరుగుల వెనుకబడి ఉంది.
బుమ్రాకు ఐదు వికెట్లు
ఈ మ్యాచ్లో భారత స్టార్ బౌలర్ బుమ్రా ఐదు వికెట్లు సాధించాడు. ఇంగ్లండ్ఓపెనర్లు క్రావ్లె, డకెట్,జో రూట్, క్రిస్ వోక్స్, జోష్ టంగ్ వికెట్లను బుమ్రా తీశాడు. టెస్టుల్లో బుమ్రా ఐదు వికెట్ల మార్కును చేరడం ఇది 14వ సారి. ఇక బుమ్రాకు తోడుగా ప్రసిద్ధ్ మూడు వికెట్లు సాధించగా, మహ్మద్ సిరాజ్ రెండు వికెట్లతో రాణించాడు.