సెప్టెంబర్ 4 నుంచి ఐఎస్ఎల్ సీజన్
న్యూఢిల్లీ: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్)లో టాటా స్టీల్ యాజమాన్యం జంషెడ్పూర్ ఫుట్బాల్ క్లబ్ (ఎఫ్సీ) వాటాలను విక్రయించింది. ఆ జట్టు పూర్తి వాటాలను శుక్రవారం గోవాకు చెందిన ‘చర్చిల్ బ్రదర్స్’ ఫుట్బాల్ క్లబ్ కొనుగోలు చేసుకుంది. వచ్చే నెల 4 నుంచి ఐఎస్ఎల్ సీజన్ ప్రారంభం కానుంది.
ఇందులో పాల్గొనే అన్నీ క్లబ్లు భాగస్వామ్య రుసుము 1 కోటి 10 లక్షలు చెల్లించాలని అఖిల భారత ఫుట్బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) గడువు విధించగా... జంషెడ్పూర్ ఎఫ్సీ మినహా మిగిలిన ఫ్రాంచైజీలన్నీ రుసుము చెల్లించాయి. శుక్రవారం జంషెడ్పూర్ ఎఫ్సీ స్పోరి్టంగ్ లైసెన్స్ను 100 రూపాయల నామమాత్ర ధరకు చర్చిల్ బ్రదర్స్కు బదిలీ చేసింది.
సెప్టెంబర్ 1 నుంచి జంషెడ్పూర్ ఎఫ్సీ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది కాంట్రాక్టులను చర్చిల్ బ్రదర్స్ స్వీకరించనుంది. ‘టాటా స్టీల్, జంషెడ్పూర్ ఫుట్బాల్ స్పోరి్టంగ్ ప్రైవేట్ లిమిటెడ్ (జేఎఫ్ఎస్పీఎల్) లోని తమ ఈక్విటీ షేర్లను చర్చిల్ బ్రదర్స్ ఫుట్బాల్ క్లబ్కు బదిలీ చేశాం’ అని టాటా స్టీల్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఐఎస్ఎల్ నుంచి తప్పుకున్నప్పటికీ ఫుట్బాల్కు ప్రోత్సాహం అందించడం... ప్రతిభను గుర్తించి సానబెట్టడం మాత్రం ఆపబోమని టాటా స్టీల్ స్పష్టం చేసింది. 1987లో ప్రారంభించిన టాటా ఫుట్బాల్ అకాడమీ ద్వారా ఇప్పటి వరకు 300 మందికి పైగా ప్లేయర్లు శిక్షణ పొందగా... అందులో 150 మంది భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. త్వరలోనే బాలికల కోసం ఒక ప్రత్యేకమైన ఫుట్బాల్ అకాడమీ ప్రారంభించనున్నట్లు టాటా స్టీల్ వెల్లడించింది.


