
PC: BCCI/IPL.com
ఐపీఎల్-2025లో చెన్నై సూపర్ కింగ్స్ ఓటముల పరంపర కొనసాగుతోంది. ఈ మెగా టోర్నీలో భాగంగా చెపాక్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో 25 పరుగుల తేడాతో సీఎస్కే ఓటమి పాలైంది. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ చెన్నై తేలిపోయింది. 184 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 158 పరుగులకే పరిమితమైంది.
సీఎస్కే బ్యాటర్లలో విజయ్ శంకర్ 69 పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. ఎంఎస్ ధోని(30 నాటౌట్) పర్వాలేదన్పించాడు. మిగితా బ్యాటర్లంతా దారుణంగా విఫలమయ్యారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్ నిగమ్ రెండు వికెట్లు పడగొట్టగా.. ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, స్టార్క్ తలా వికెట్ సాధించారు. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫ్యలమే తమ ఓటమికి కారణమని గైక్వాడ్ వెల్లడించాడు.
"గత కొన్ని మ్యాచ్ల నుంచి మాకు ఏదీ కలిసి రావడం లేదు. ప్రతీ మ్యాచ్లోనూ మేము మెరుగయ్యేందుకు ప్రయత్నిస్తున్నాము. కానీ మేము ఆశించిన ఫలితం మాత్రం రావడం లేదు. ఈ మ్యాచ్లో పవర్ ప్లేలో ఎక్కువగా వికెట్లు కోల్పోయాము. బౌలింగ్లో కూడా మేము చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోతున్నాము.
అదనంగా 15 నుంచి 20 పరుగులు అదనంగా ఇస్తున్నాం. లేదంటే పవర్ ప్లేలోనే ఎక్కువ వికెట్లు కోల్పోతున్నాం. లోపాలను సరిదిద్దుకోవాడనికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఫలితం మాత్రం దక్కడం లేదు. పవర్ ప్లేలో మేం అతి జాగ్రత్తగా బ్యాటింగ్, బౌలింగ్ చేస్తుండటం మాకు నష్టం కలిగిస్తోంది అన్పిస్తోంది.
పవర్ ప్లేలో ఎక్కువగా వికెట్లు కోల్పోతుండడంతో బ్యాక్ఫుట్లో ఉండిపోతున్నాము. అందరూ సమిష్టిగా రాణించాల్సిన అవసరముంది. ఈ మ్యాచ్లో ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పిచ్ కండీషన్స్ను చక్కగా ఉపయోగించుకున్నారు. శివమే దూబే క్రీజులో ఉన్నప్పుడు మేము ఆ మూమెంటమ్ అందుకుంటామని భావించాము. కానీ అలా జరగలేదు" అని పోస్ట్ మ్యాచ్ ప్రేజేంటేషన్లో గైక్వాడ్ పేర్కొన్నాడు.