RCB VS CSK: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి | IPL 2025, RCB VS CSK: Virat Kohli Creates History For Most 500 Plus Scores In A Season | Sakshi
Sakshi News home page

RCB VS CSK: చరిత్ర సృష్టించిన విరాట్‌ కోహ్లి

May 4 2025 9:14 AM | Updated on May 4 2025 11:26 AM

IPL 2025, RCB VS CSK: Virat Kohli Creates History For Most 500 Plus Scores In A Season

Photo Courtesy: BCCI

రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లి మరో భారీ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 500 కంటే ఎక్కువ పరుగులు (ఓ సీజన్‌లో) చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సీజన్‌తో కలుపుకుని విరాట్‌ మొత్తం ఎనిమిది సీజన్లలో 500 కంటే ఎక్కువ పరుగులు చేశాడు. 

విరాట్‌ తర్వాత అత్యధిక సీజన్లలో 500 ప్లస్‌ పరుగులు సాధించిన ఘనత డేవిడ్‌ వార్నర్‌కు దక్కుతుంది. వార్నర్‌ ఏడు సీజన్లలో ఈ ఘనత సాధించాడు. విరాట్‌, వార్నర్‌ తర్వాత కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధవన్‌ అత్యధిక సీజన్లలో 500 ప్లస్‌ స్కోర్లు చేశారు. రాహుల్‌ 6, ధనవ్‌ 5 సీజన్లలో 500 ప్లస్‌ స్కోర్లు చేశాడు.  నిన్న (మే 3) సీఎస్‌కేతో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ ఎనిమిదో సారి ఓ సీజన్‌లో 500 ప్లస్‌ పరుగులు పూర్తి చేశాడు.

విరాట్‌ 500 కంటే ఎక్కువ పరుగులు చేసిన సీజన్లు..
2015- 505 పరుగులు
2025- 505*
2018- 530
2011- 557
2013- 634
2023- 639
2024- 741
2016- 973

కాగా, నిన్నటి మ్యాచ్‌లో 33 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 62 పరుగులు చేసిన విరాట్‌.. ఐపీఎల్‌లో ఎనిమిదో సారి 500 ప్లస్‌ పరుగులు సాధించడంతో పాటు మరిన్ని రికార్డులు సాధించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడిన విరాట్‌.. ఏడు అర్ద సెంచరీల సాయంతో 505 పరుగులు చేసి ఆరెంజ్‌ క్యాప్‌ (సీజన్‌లో లీడింగ్‌ రన్‌ స్కోరర్‌) సొంతం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో విరాట్‌ సాధించిన మరిన్ని రికార్డులు..
👉ఐపీఎల్‌లో ఒక జ‌ట్టుపై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా కోహ్లి రికార్డుల‌కెక్కాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు  సీఎస్‌కేపై 1146 ప‌రుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గ‌జం డేవిడ్ వార్న‌ర్ పేరిట ఉండేది. వార్న‌ర్ పంజాబ్ కింగ్స్‌పై 1134 ప‌రుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో వార్న‌ర్ రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు.

👉 సీఎస్‌కేపై అత్య‌ధిక ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు సాధించిన ప్లేయ‌ర్‌గా కోహ్లి నిలిచాడు. కోహ్లి ఇప్ప‌టివ‌ర‌కు సీఎస్‌కేపై 10 సార్లు యాబైకిపైగా ప‌రుగులు సాధించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు శిఖ‌ర్ ధవ‌న్ పేరిట ఉండేది. ధవ‌న్ సీఎస్‌కేపై 9 సార్లు ఫిప్టీ ప్ల‌స్ స్కోర్లు న‌మోదు చేశాడు.

👉వరల్డ్ ఫ్రాంచైజీ క్రికెట్‌లో ఒకే జట్టు తరపున  300 సిక్సర్లు కొట్టిన ఏకైక ప్లేయర్‌గా విరాట్ నిలిచాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరపున కోహ్లి 300 సిక్స్‌లు బాదాడు. కోహ్లి తర్వాతి స్దానంలో క్రిస్ గేల్‌(263) ఉన్నాడు.

👉టీ20 క్రికెట్‌లో ఒకే వేదిక‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కోహ్లి నిలిచాడు. బెంగ‌ళూరు చిన్న‌స్వామి స్టేడియంలో కోహ్లి 154 సిక్స్‌లు బాదాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. గేల్ కూడా చిన్న‌స్వామి స్టేడియంలో 151 కొట్టాడు.

👉ఐపీఎల్‌లో 8500 ప‌రుగుల మైలురాయిని అందుకున్న తొలి ప్లేయ‌ర్‌గా కోహ్లి రికార్డులెక్కాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన సమరంలో సీఎస్‌కేపై ఆర్సీబీ 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. సీఎస్‌కే గెలుపుకు చివరి ఓవర్‌లో 15 పరుగులు అవసరం కాగా.. ఆర్సీబీ విజయవంతంగా కాపాడుకుంది. యశ్‌ దయాల్‌ చివరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 

ఈ గెలుపుతో ఆర్సీబీ పాయింట్ల పట్టికలో తిరిగి అగ్రస్థానానికి చేరుకుంది. ప్లే ఆఫ్స్‌ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించిన సీఎస్‌కే ఈ ఓటమితో చివరి స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఈ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారైనట్లే.

టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆర్సీబీ.. జేకబ్‌ బేతెల్‌ (33 బంతుల్లో 55; 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్‌ కోహ్లి (33 బంతుల్లో 62; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రొమారియో షెపర్ట్‌ (14 బంతుల్లో 53 నాటౌట్‌; 4 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది.

సీఎస్‌కే బౌలర్లలో పతిరణ (4-0-36-3), నూర్‌ అహ్మద్‌ (4-0-26-1) అద్భుతంగా బౌలింగ్‌ చేయగా.. ఖలీల్‌ అహ్మద్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (3-0-65-0). ఖలీల్‌ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో షెపర్డ్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి 4 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 33 పరుగులు పిండుకున్నాడు. పతిరణ వేసిన చివరి ఓవర్‌లోనూ అదే జోరు కొనసాగించిన షెపర్డ్‌ ఆ ఓవర్‌లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు సహా 21 పరుగులు రాబట్టాడు.

అనంతరం 214 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన సీఎస్‌కే.. చివరి బంతి వరుకు పోరాడి నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగలిగింది. ఆయుశ్‌ మాత్రే (48 బంతుల్లో 94; 9 ఫోర్లు, 5 సిక్సర్లు), రవీంద్ర జడేజా (45 బంతుల్లో 77 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) సీఎస్‌కేను గెలిపించేందుకు సర్వ శక్తులు ఒడ్డారు. 

ఈ మ్యాచ్‌లో మాత్రే, డెవాల్డ్‌ బ్రెవిస్‌ వరుస బంతుల్లో ఔట్‌ కావడం​ సీఎస్‌కేకు టర్నింగ్‌ పాయింట్‌. ఇన్నింగ్స్‌ 17వ ఓవర్‌లో ఎంగిడి ఈ ఇద్దరి వికెట్లు తీసి ఆర్సీబీని గేమ్‌లోకి తెచ్చాడు.

చివరి మూడు ఓవర్లలో (సుయాశ్‌, భువీ, దయాల్‌) ఆర్సీబీ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో సీఎస్‌కే లక్ష్యానికి మూడు పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఆర్సీబీ బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా.. సీజన్‌లో తొలిసారి భువీ వికెట్‌ లేకుండా అత్యంత ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు (4-0-55-0).

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement