IPL 2025: ఆ ఐదుగురు రాణిస్తే.. పంజాబ్‌ కింగ్స్‌ కల సాకారం! | IPL 2025: Punjab Kings Aim For 1st Trophy With Title Winner Shreyas Iyer, Know About Key Players In Team | Sakshi
Sakshi News home page

IPL 2025: ఆ ఐదుగురు రాణిస్తే.. పంజాబ్‌ కింగ్స్‌ కల సాకారం!

Mar 22 2025 9:39 AM | Updated on Mar 22 2025 10:11 AM

IPL 2025: Punjab Kings Aim For 1st Trophy With Title Winner Shreyas Iyer

మాక్సీ- శ్రేయస్‌- అర్ష్‌దీప్‌ (Photo Courtesy: PBKS/BCCI)

పంజాబ్ కింగ్స్ జట్టు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆరంభ సీజన్‌ (2008) నుంచి ఇప్పటి వరకూ చెప్పుకోదగ్గ రీతిలో రాణించలేకపోయింది. ఆ జట్టు ఫలితాలను పరిశీలించినట్లయితే ఐపీఎల్ చరిత్రలో రెండుసార్లు మాత్రమే ప్లేఆఫ్స్‌ చేరుకుంది. 

మొదటిసారి 2008లో.. ఆ తర్వాత 2014 సీజన్‌లో టాప్‌-4లో నిలిచింది. 2014లో ఫైనల్‌కు చేరుకుని బెంగళూరులో జరిగిన టైటిల్ పొరులో కోల్‌కతా నైట్ రైడర్స్ చేతిలో పరాజయం చవిచూసింది.

శ్రేయస్‌ అయ్యర్‌కి కెప్టెన్సీ బాధ్యతలు
ఆ రెండు సీజన్లను మినహాయిస్తే ఒక దశాబ్దం పాటు కింగ్స్ ప్లేఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. నిరంతరం కోచ్‌లు, కెప్టెన్‌లను మార్చడం కూడా కింగ్స్ ప్రదర్శన పై కోలుకోని దెబ్బతీసింది. 

పంజాబ్ కింగ్స్ మేనేజ్‌మెంట్ గత 17 సీజన్లలో పదహారు మంది కెప్టెన్లు, పది 10 మంది కోచ్‌లను మార్చింది. ఈసారి కూడా భారీ మార్పులతో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమైంది.

ఈసారి 2024లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ముందుండి నడిపించి మూడో ఐపీఎల్ టైటిల్‌ను కట్టబెట్టిన భారత బ్యాటర్‌ శ్రేయస్ అయ్యర్ కోసం భారీగా ఖర్చు చేసింది. ఏకంగా రూ 26.75 కోట్లతో శ్రేయస్ అయ్యర్ ని కనుగోలు చేసి అతనికి కెప్టెన్సీ బాధ్యతలు కట్టబెట్టింది. హెడ్‌కోచ్ గా మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ రికీ పాంటింగ్‌ను ఎంచుకుంది.

వేలంలో పంజాబ్ కింగ్స్ ఎలా రాణించింది?
ఇక వేలానికి ముందు ఇద్దరు అన్‌క్యాప్డ్ ఆటగాళ్లు శశాంక్ సింగ్ మరియు ప్రభ్‌సిమ్రాన్ సింగ్ ని రెటైన్ చేసారు. ఇక వేలంలో ఏకంగా రూ 112 కోట్లు ఖర్చు చేశారు. ముందుగా శ్రేయస్ అయ్యర్ కోసం భారీగా ఖర్చు చేశారు. తర్వాత అర్ష్‌దీప్ సింగ్‌ను రూ 18 కోట్లకు తిరిగి తీసుకున్నారు. అదే మొత్తానికి భారత మాజీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను కొనుగోలు చేశారు.

ఇంకా ఆస్ట్రేలియా ఆల్ రౌండర్లు గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్. న్యూజిలాండ్ పేసర్ మార్కో యాన్సెన్, ఆఫ్ఘనిస్తాన్ కి చెందిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌ల చేరడంతో ఆల్ రౌండ్ విభాగాన్ని బాగా బలోపేతం చేసినట్లు కనిపిస్తోంది.

కింగ్స్ జట్టులో నేహాల్ వధేరా, వైశక్ విజయ్‌కుమార్, యష్ ఠాకూర్ వంటి కొంతమంది యువ మరియు ఉత్తేజకరమైన ఆటగాళ్లను కూడా ఉన్నారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ లో ముంబై విజయంలో కీలక పాత్ర వహించిన సూర్యాంష్ షెడ్గే, ముషీర్ ఖాన్ కూడా జట్టులో చేరారు. వీరంతా ఇటీవలి కాలంలో అందరి దృష్టిని ఆకర్షించారు.

ఈ సీజన్‌లో కింగ్స్‌కు లాకీ ఫెర్గూసన్ ప్రధాన పేసర్లలో ఒకడిగా ఉండే అవకాశముంది. ఇంకా విదేశీయ ఆటగాళ్లు జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్ట్‌లెట్ జట్టుకు మరింత నాణ్యతను జోడిస్తారు. మొత్తమ్మీద సీనియర్, యువ ఆటగాళ్లతో, కొత్త కెప్టెన్‌తో జట్టు కొత్త తరహా వ్యూహంతో సిద్ధంగా ఉంది.

పంజాబ్ కింగ్స్ జట్టు లో ప్రధాన ఆటగాళ్లు
శ్రేయస్ అయ్యర్
ఛాంపియన్స్ ట్రోఫీ లో నిలకడ గా రాణించి భారత్ విజయంలో కీలక పాత్ర వహించిన శ్రేయస్ అయ్యర్ పై పంజాబ్ కింగ్స్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ ముంబై బ్యాటర్‌ గత సీజన్ లో కోల్‌కతా నైట్ రైడర్స్ ను ముందుండి నడిపించి టైటిల్ సాధించిపెట్టాడు.

ఇప్పుడు కింగ్స్ కూడా శ్రేయాస్ అయ్యర్ నుంచి అదే కానుక కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌తో ఉన్న ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ కింగ్స్‌కు ప్రధాన ఆటగాళ్లలో ఒకడు అనడంలో సందేహం లేదు.

యుజ్వేంద్ర చాహల్
ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఈ స్పిన్ బౌలర్ కొత్త సీజన్‌లో కింగ్స్‌తో కలిసి తనదైన ముద్ర వేయాలని చూస్తున్నాడు. భారత్ జట్టులో స్థానం కోల్పోయినప్పటికీ చాహల్ స్పిన్ మాయాజాలాన్ని తక్కువగా అంచనా వేయలేం.

అర్ష్‌దీప్ సింగ్
టీ20 ఫార్మాట్ లో భారత్ తరుపున నిలకడగా రాణిస్తున్న ఈ ఎడమచేతి వాటం పేస్ బౌలర్ పంజాబ్ కింగ్స్ బౌలింగ్ కి సారధ్యం వహించే అవకాశముంది. గత కొన్ని సీజన్లలో ఐపిఎల్ లో నిరంతరం వికెట్లు సాధిస్తూ భారత్ జట్టులోకి చొచ్చుకొచ్చిన అర్ష్‌దీప్ మరోసారి తన ప్రతిభని నిరూపించుకోవాలని భావిస్తున్నాడు. ప్రస్తుత అర్ష్‌దీప్ ఫామ్ పంజాబ్‌కు కీలకం అవుతుంది.

గ్లెన్ మాక్స్వెల్
2014లో పంజాబ్ ప్లేఆఫ్స్‌ చేరుకున్న సమయంలో మాక్స్వెల్ కూడా జట్టులో ఉన్నాడు. మళ్లీ మాక్స్వెల్ అదే తరహా లో మెరుపులు మెరిపిస్తాడని కింగ్స్ భావిస్తోంది. అతను నాలుగో స్థానంలో బ్యాటింగ్ కి వచ్చి పెద్ద పాత్ర పోషిస్తాడని భావిస్తున్నారు.

మార్కస్ స్టోయినిస్
ఈ సీజన్‌లో స్టోయినిస్ తన అల్ రౌండ్ ప్రతిభ కనబరుస్తాడని కింగ్స్ ఏంతో ఆశలు పెట్టుకుంది. టాప్‌లో పరుగులు చేయడం, బౌలింగ్ లో కూడా కీలక పాత్ర వహిస్తాడని పంజబ్ గట్టి నమ్మకంతో ఉంది.

పంజాబ్ కింగ్స్ జట్టు
శ్రేయస్ అయ్యర్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, మార్కస్ స్టోయినిస్, నేహాల్ వధేరా, గ్లెన్ మాక్స్‌వెల్, వైశాక్ విజయ్‌కుమార్, యష్ ఠాకూర్, హర్‌ప్రీత్ బ్రార్, విష్ణు వినోద్, మార్కో జాన్సెన్, లాకీ ఫెర్గూసన్, జోష్ ఇంగ్లిస్, జేవియర్ బార్ట్‌లెట్, కుల్దీప్ సేన్, పైలా అవినాష్, సూర్యాంష్ షెడ్గే, ముషీర్ ఖాన్, హర్నూర్ పన్ను, ఆరోన్ హార్డీ, ప్రియాంష్ ఆర్య, అజ్మతుల్లా ఒమర్జాయ్.

Advertisement
 
Advertisement
Advertisement