ఐపీఎల్‌ 2025 నిరవధిక వాయిదా.. అధికారిక ప్రకటన | IPL 2025 Postponed Indefinitely Amid India Pakistan Tensions, Read Story Inside | Sakshi
Sakshi News home page

IPL 2025 Postponed: ఐపీఎల్‌ 2025 నిరవధిక వాయిదా.. అధికారిక ప్రకటన

May 9 2025 12:20 PM | Updated on May 9 2025 12:52 PM

IPL 2025 Postponed Indefinitely Amid India Pakistan Tensions

Photo Courtesy: BCCI

భారత్‌, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్‌ 2025 నిరవధికంగా వాయిదా పడింది. ఈ మేరకు బీసీసీఐ ఇవాళ (మే 9) అధికారిక ప్రకటన విడుదల చేసింది. వేదిక, తదుపరి షెడ్యూల్‌ వివరాలు త్వరలో వెల్లడిస్తామని బీసీసీఐ పేర్కొంది. యుద్ద పరిస్థితుల్లో లీగ్‌ నిర్వహించలేమని బీసీసీఐ చెప్పింది. దేశ రక్షణ, ఆటగాళ్ల భద్రతే తమ ప్రాధాన్యత అని బోర్డు ఉన్నతాధికారి వివరించారు.  

ఉద్రిక్తతల కారణంగా పంజాబ్‌-ఢిల్లీ మ్యాచ్‌ రద్దు
నిన్న (మే 8) ధర్మశాల వేదికగా పంజాబ్‌-ఢిల్లీ మధ్య జరగాల్సిన ఐపీఎల్‌ మ్యాచ్‌ రద్దైంది. షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభమైన మ్యాచ్‌ను బ్లాక్‌ అవుట్‌ ప్రకటించడంతో అత్యవసరంగా రద్దు చేశారు. తొలుత ఫ్లడ్‌ లైట్ల సమస్య కారణంగా మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన ఐపీఎల్‌ వర్గాలు.. ఆతర్వాత అసలు విషయాన్ని వెల్లడించాయి. పాక​్‌ దాడులను తెగబడే అవకాశాలు ఉండటంతో ముందు జాగ్రత్త చర్యగా మ్యాచ్ రద్దు చేస్తున్నట్లు ఐపీఎల్‌ చీఫ్‌ అరుణ్‌ ధుమాల్‌ ప్రకటించాడు.

మ్యాచ్‌ రద్దు ప్రకటన వచ్చిన వెంటనే ఆటగాళ్లంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని స్టేడియాన్ని వీడారు. ఆటగాళ్లతో పాటు ఇరు జట్ల బృందాలను హుటాహుటిన ప్రత్యేక ట్రయిన్‌ ద్వారా పఠాన్‌కోట్‌ గుండా ఢిల్లీకి తరలించారు. మ్యాచ్‌ ఆగిపోయే సమయానికి తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న పంజాబ్‌ స్కోర్‌ 122/1గా (10.1 ఓవర్లలో) ఉండింది. పంజాబ్‌ ఓపెనర్లు ప్రియాంశ్‌ ఆర్య (34 బంతుల్లో 70; 5 ఫోర్లు, 6 సిక్సర్లు), ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (28 బంతుల్లో 50 నాటౌట్‌; 7 ఫోర్లు) భారీ షాట్లతో విధ్వంసం సృష్టించారు.

ఏం జరిగిందంటే..?
ఏప్రిల్‌ 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రమూకలు విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడి 26 మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ ఘటన తర్వాత కొద్ది రోజుల కామ్‌గా ఉన్న భారత్‌.. ఈ మంగళవారం​ అర్దరాత్రి పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది. ఆపరేషన్‌ సిందూర్‌ పేరిట సాగిన ఈ ప్రతి దాడిలో 100 మంది ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యారు.

ఇందుకు బ‌దులుగా పాకిస్తాన్‌ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడింది. రాకెట్లు, మిసైళ్లతో జనావాసాలను టార్గెట్‌ చేసింది. పాక్‌ దుశ్చర్యకు భార‌త్ సైతం ధీటుగా బ‌దులిస్తోంది. భార‌త బ‌ల‌గాలు పాక్ మిస్సైల్లను గాల్లోనే పేల్చేస్తున్నాయి. సమాంతరంగా పాక్‌లోని కీలక నగరాలపై డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికే భారత బలగాలు పాక్‌ను కోలుకోలేని దెబ్బతీశాయి. అయినా పాక్‌ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ.. కాల్పులకు పాల్పడుతూనే ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement