డ్రెస్సింగ్ రూమ్‌లో విబేధాలు.. టీమిండియా వీడనున్న కోచ్‌? | Gautam Gambhirs coaching staff set for changes after England tour: Report | Sakshi
Sakshi News home page

డ్రెస్సింగ్ రూమ్‌లో విబేధాలు.. టీమిండియా వీడనున్న కోచ్‌?

Jul 11 2026 3:26 PM | Updated on Jul 11 2026 3:30 PM

Gautam Gambhirs coaching staff set for changes after England tour: Report

శ్రీలంకతో టెస్ట్ సిరీస్‌కు ముందు భార‌త పురుష‌ల క్రికెట్ జ‌ట్టు  కోచింగ్ స్టాప్‌లో కొన్ని మార్పులు చోటు చేసుకోనున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. ఒక సీనియర్ సపోర్ట్ స్టాఫ్ సభ్యుడు తన పదవి నుంచి తప్పుకోనున్నట్లు స‌మాచారం. ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ కథనం ప్రకారం.. ఇంగ్లండ్ టూర్ ముగిసిన తర్వాత సదరు సభ్యుడు తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది.

అయితే అతడు మేనెజ్‌మెంట్‌పై అసంతృప్తితో తప్పుకుంటున్నారా లేదా కొత్త కోచింగ్ బాధ్యతల కోసమా అనేది స్పష్టం కాలేదు. కానీ ఆ కోచ్ ఇప్పటికే ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీతో చర్చలు జరిపారని, త్వరలోనే ఆ జట్టు కోచింగ్ స్టాప్‌లో చేరనున్నాడని పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. 

అంతేకాకుండా భవిష్యత్తులో మరొకరు కూడా తప్పుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత భారత హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి రాహుల్ ద్రవిడ్ వైదొలిగాడు. ఆ తర్వాత అతడి స్ధానంలో గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టాడు. 

అతడితో పాటు ర్యాన్ టెన్‌డెష్కాట్‌, అభిషేక్ నాయర్ సహాయక కోచ్‌లగా.. మోర్నీ మోర్కెల్ బౌలింగ్ కోచ్‌లగా నియమితులయ్యారు. టి. దిలీప్‌ను యథావిధిగా ఫీల్డింగ్ కోచ్‌గా కొనసాగించారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తర్వాత అభిషేక్ నాయర్ అసిస్టెంట్ కోచ్‌గా తప్పుకొని, కేకేఆర్ హెడ్‌కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు.  తర్వాత సీతాన్షు కోటక్ బ్యాటింగ్ కోచ్‌గా గంభీర్ కోటరీలోకి చేరాడు. 

అప్పటి నుంచే విబేధాలు?
అయితే గంభీర్ హయాంలో సొంతగడ్డపై భారత్ వరుసగా న్యూజిలాండ్ (2024), దక్షిణాఫ్రికా (2025) చేతుల్లో ఘోర టెస్ట్ సిరీస్ ఓటములను చవిచూసింది. దీంతో దక్షిణాఫ్రికా చేతిలో వైట్‌వాష్ అయిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌లో ఆటగాళ్లకు-కోచ్‌లకు మధ్య, అలాగే సెలెక్టర్లకు-కోచింగ్ స్టాఫ్‌కు మధ్య భేదాభిప్రాయాలు తలెత్తినట్లు అప్పటిలో వార్తలు వచ్చాయి. 

ఆ విభేదాలు ఇప్పుడు కూడా అలానే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే సదరు కోచ్‌ టీమిండియాను వీడేందుకు సిద్దమయ్యాడు మరి కొన్ని రిపోర్ట్‌లు పేర్కొం‍టున్నాయి. కాగా టీ20 నంబర్‌ వన్‌ జట్టు అయిన భారత్‌కు యూకే పర్యటన తీవ్ర నిరాశను మిగిల్చింది. 

శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా ఇప్పటివరకు పర్యటనలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. దీంతో ఈ వరుస వైఫల్యాలపై నివేదిక ఇవ్వాలని గంభీర్‌ను బీసీసీఐ సూచింది. భారత్‌కు చేరుకున్న వెంటనే భారత కోచింగ్‌ బృందంతో బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నారు. 

ఇక జింబాబ్వే పర్యటనతో పాటు ఆసియా క్రీడలకు భారత జట్టు తాత్కాలిక హెడ్‌ కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. అయితే శ్రీలంక టెస్ట్‌ సిరీస్‌తో పాటు ఆక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగే హోమ్ సిరీస్‌లో గంభీర్‌ హెడ్‌కోచ్‌గా ఉండనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement