CSK అభిమానికి చేదు అనుభవం.. HCAపై ఆగ్రహం! పోస్ట్‌ వైరల్‌ | Sakshi
Sakshi News home page

CSK అభిమానికి చేదు అనుభవం.. HCAపై ఆగ్రహం! డబ్బు ఇస్తారా?

Published Sat, Apr 6 2024 1:55 PM

IPL 2024: CSK Fan Demands Refund As No Seat 66 On Rs 4500 Was Found In Uppal - Sakshi

మహేంద్ర సింగ్‌ ధోనికి ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తలాకు ఇదే చివరి సీజన్‌ అన్న నేపథ్యంలో గతేడాది అతడిని చూసేందుకు అభిమానులు మైదానాలకు పోటెత్తిన విషయం తెలిసిందే. స్టేడియం ఏదైనా.. తమ సొంత జట్టును కూడా కాదని ధోని బ్యాటింగ్‌ వచ్చిన మూమెంట్స్‌ను సెలబ్రేట్‌ చేసుకున్నారు.

అయితే, ధోని ఐపీఎల్‌-2024లోనూ ఆడుతుండటంతో అభిమానులకు రెట్టింపు సంతోషాన్నిస్తోంది. ఇక ఈసారి ధోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా కాకున్నా ఆటగాడిగా మైదానంలో దిగుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడి వీరాభిమాని అయిన జునైద్‌ అహ్మద్‌ అనే యువకుడు సన్‌రైజర్స్‌తో సీఎస్‌కే మ్యాచ్‌ నేపథ్యంలో టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు.

అయితే, శుక్రవారం ఉప్పల్‌ స్టేడియానికి వచ్చిన అతడికి వింత అనుభవం ఎదురైంది. ఏకంగా రూ. 4,500 పెట్టి ఖర్చు పెట్టి మ్యాచ్ కోసం వచ్చిన జునైద్ అహ్మద్‌ టికెట్‌లో.. అతడికి J-66 సీట్ నెంబర్ అలాట్ చేసినట్లు ఉంది. సంతోషంగా స్టేడియానికి వెళ్లగా.. ఆ నంబరుతో అసలు సీటే కనిపించలేదు.

J-65 తర్వాత J-67 సీట్ ఉండటంతో అతడు షాకయ్యాడు. సిబ్బందికి విషయం చెప్పినా వారూ ఏమీ చేయలేకపోయారు. ఫలితంగా జునైద్‌ అహ్మద్‌ మ్యాచ్‌ మొత్తం నిలబడే చూడాల్సి వచ్చింది. హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ నిర్లక్ష్యం వల్లే తనకు ఈ దుస్థితి తలెత్తిందంటూ అతడు ఎక్స్‌ వేదికగా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నాడు.

డబ్బులు పెట్టి టికెట్‌ కొంటే.. నాలుగు గంటలపాటు నిలబడి మ్యాచ్ చూడాల్సి వచ్చిందని వాపోయాడు. తనకు కలిగిన అసౌకర్యానికి నష్టపరిహారంగా తిరిగి డబ్బులు పొందగలనా? అంటూ బీసీసీఐతో పాటు హెచ్‌సీఏ అధ్యక్షుడిని కూడా జునైద్‌ ట్యాగ్‌ చేశాడు. అతడి ట్వీట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. 

కాగా ఈ మ్యాచ్‌కు ముందు స్టేడియంలోకి అనుమతించే క్రమంలోనూ పోలీసులకు, అభిమానులకు మధ్య తోపులాట జరిగిన విషయం తెలిసిందే. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఏదేమైనా హెచ్‌సీఏ తీరు మారకపోవడంతో ఫ్యాన్స్‌ పెదవి విరుస్తున్నారు. స్టేడియానికి వెళ్తే ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది పడుతూనే ఉంటామని వాపోతున్నారు.

ఇక ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌పై సన్‌రైజర్స్‌ ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా సొంత మైదానంలో వరుసగా రెండో విజయం నమోదు చేసింది. పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి ఎగబాకింది.

చదవండి: జడ్డూ అవుట్‌ కావాలి కదా? కమిన్స్‌ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్‌

Advertisement
Advertisement