భారత జట్టు ప్రకటన.. యువ సంచలనానికి చోటు | Indian Womens Cricket team announced for 2026 Asian Games | Sakshi
Sakshi News home page

భారత జట్టు ప్రకటన.. యువ సంచలనానికి చోటు

Jun 30 2026 11:05 AM | Updated on Jun 30 2026 11:23 AM

Indian Womens Cricket team announced for 2026 Asian Games

జపాన్‌ వేదికగా సెప్టెంబర్‌లో జరిగే ఆసియా క్రీడలు 2026 కోసం 15 మంది సభ్యుల భారత మహిళల క్రికెట్‌ జట్టును ఇవాళ (జూన్‌ 30) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, వైస్‌ కెప్టెన్‌గా స్మృతి మంధాన కొనసాగనున్నారు.

స్టార్‌ ప్లేయర్లు జెమీమా రోడ్రిగ్స్‌, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, రిచా ఘోష్‌, రేణుకా సింగ్‌ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఆల్‌రౌండర్ శ్రేయాంక పాటిల్‌ ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు లోబడి ఎంపికైంది. ఈ జట్టులో 17 ఏళ్ల వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ జి కమిలిని ప్రత్యేక ఆకర్షనగా నిలిచింది. యస్తికా భాటియా స్థానంలో కమిలిని జట్టులోకి వచ్చింది. తాజాగా టీ20 ప్రపంచకప్‌ నుంచి వైదొలిగిన భారత జట్టులో ఇదొక్కటే మార్పు.

కమిలిని ఇటీవల సంచలన ప్రదర్శనలతో ఆకట్టుకుంటుంది. ఇంగ్లండ్‌ పర్యటనలో ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌ ఆమెకు ఆసియా క్రీడల బెర్త్‌ దక్కేలా చేసింది. దీనికి ముందు అండర్‌-19 ప్రపంచకప్‌లోనూ కమిలిని రాణించింది. ఈ ప్రద‍ర్శనల కారణంగా డబ్ల్యూపీఎల్‌ బెర్త్‌ కూడా దక్కించుకుంది. 2025 వేలంలో కమిలినిని ముంబై ఇండియన్స్‌ రూ. 1.6 కోట్లకు దక్కించుకుంది. ఈ సీజన్‌ వేలానికి ముందు మరోసారి కొనసాగించింది.

కాగా, ఆసియా క్రీడల్లో భారత్‌ మరోసారి టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. హాంగ్‌ఝౌ వేదికగా జరిగిన గత క్రీడల్లో టీమిండియా స్వర్ణం కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. పురుషుల విభాగంలోనూ టీమిండియానే గోల్డ్‌ గెలుచుకుంది.

ఆసియా క్రీడలు 2026 కోసం భారత జట్టు..
హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షఫాలీ వర్మ, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్‌కీపర్‌), జి కమలిని (వికెట్‌కీపర్‌), భారతీ ఫుల్మాలి, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, శ్రేయాంక​ పాటిల్‌ (ఫిట్‌నెస్‌ క్లియరెన్స్‌కు లోబడి), రాధా యాదవ్‌, నందిని శర్మ

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement