ఇక... మైదానంలో మ్యాచ్‌ ప్రాక్టీస్‌ | Indian teams warm up matches start today | Sakshi
Sakshi News home page

ఇక... మైదానంలో మ్యాచ్‌ ప్రాక్టీస్‌

Jun 13 2025 3:17 AM | Updated on Jun 13 2025 3:17 AM

Indian teams warm up matches start today

నేటి నుంచి భారత జట్ల సన్నాహక పోరు 

భారత్‌ ‘ఎ’తో సీనియర్‌ జట్టు ‘ఢీ’  

బెకెన్‌హామ్‌: ఐదు టెస్టుల పూర్తిస్థాయి సిరీస్‌కు ముందు తమ బలాన్ని పరీక్షించుకునేందుకు భారత ఆటగాళ్లంతా సిద్ధమయ్యారు. విదేశీ పర్యటనకు వెళితే సాధారణంగా అక్కడి దేశవాళీ జట్టుతో ప్రాక్టీస్‌ చేస్తారు. కానీ ఈసారి అనధికారిక టెస్టులు ఆడేందుకు ఇంగ్లండ్‌ వచ్చిన భారత్‌ ‘ఎ’ జట్టుతోనే సీనియర్‌ జట్టు వార్మప్‌ మ్యాచ్‌కు సిద్ధమైంది. ఈ నాలుగు రోజుల ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నేటి నుంచి జరుగుతుంది. 

ఇక్కడికి రాగానే నెట్స్‌లో కసరత్తు చేసిన ఆటగాళ్లు ఇప్పుడు మైదానంలో ప్రాక్టీస్‌ చేయనున్నారు. నాలుగు రోజుల పాటు జరుగనున్నప్పటికీ ఈ వార్మప్‌ పోరుకు ఫస్ట్‌క్లాస్‌ హోదా లేదు. దీంతో బాగా ఆడినా... త్వరగా అవుటైనా ఫస్ట్‌క్లాస్‌ గణాంకాల్లో నమోదు కావు. కాబట్టి ఆటగాళ్లందరూ యథేచ్ఛగా ఆడుకునేందుకు అవకాశముంటుంది. 

ఐదు రోజుల ఫార్మాట్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి రిటైరయ్యాక జరుగుతున్న తొలి సిరీస్‌ కావడంతో... తుది జట్టు కూర్పు, యువ ఆటగాళ్ల నేర్పు కొంతవరకైనా తెలుసుకునేందుకు ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ దోహదం చేస్తుందని భారత జట్టు మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. టీమిండియా బలాలు, బలహీనతలు బయటికి పొక్కకుండా ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ నిర్వహించాలని హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ అనుకుంటున్నాడు. ఇందులో భాగంగా ప్రేక్షకులు, భారత అభిమానులెవరికీ ప్రవేశం కల్పించడం లేదు. 

ఆ్రస్టేలియా పర్యటనలోనూ భారత్‌ ఇదే విధంగా చేసింది. బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ మాట్లాడుతూ నెట్స్‌లో శ్రమించడం, 90 ఓవర్ల పాటు మ్యాచ్‌ ఆడటం రెండు భిన్నమైనవని అన్నాడు. ముఖ్యంగా ఈ నాలుగు రోజుల పాటు 360 ఓవర్లు ఆడే ఆటగాళ్ల సామర్థ్యాన్ని భారత సహాయక బృందం పరిశీలిస్తుంది. అలాగే బౌలింగ్‌ విభాగానికి ఈ పర్యటనలో ఎదురయ్యే ప్రతికూలతల్నీ తెలుసుకోనుంది. పేసర్లు, స్పిన్నర్లు రోజంతా ఎన్ని ఓవర్లను ఉత్సాహంగా వేయగలరో ఒక అంచనాకు వస్తుంది. 

సీనియర్‌ స్పిన్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లకు అక్కడి బౌన్సీ పిచ్‌లపై ఎదురయ్యే సవాళ్లను కూడా భారత మేనేజ్‌మెంట్‌ బేరీజు వేస్తుంది. స్పీడ్‌స్టర్‌ బుమ్రా జట్టుకు అందుబాటులో ఉన్నప్పటికీ మొత్తం ఐదు టెస్టులు ఆడే అవకాశమైతే లేదు. ఈ విషయాన్ని సెలక్షన్‌ సమయంలోనే స్పష్టం చేశారు. ఐదింటిలో మూడు టెస్టులే అతను ఆడతాడని వెల్లడించారు. ఏ మూడు మ్యాచ్‌లనే విషయాన్ని అపుడు సెలక్టర్లు... ఇప్పుడు కోచ్‌ గంభీర్‌... స్పష్టంగా చెప్పడం లేదు.

అగ్రశ్రేణి పేసర్‌ బుమ్రా ఆరు నెలల తర్వాత టెస్టు బరిలోకి దిగబోతున్నాడు. తన విభిన్న శైలీ బౌలింగ్‌ కారణంగా తరచూ ఇబ్బందిపెట్టే వెన్నెముక గాయం నుంచి కోలుకున్నాక బుమ్రా స్వదేశంలో జరిగిన ఐపీఎల్‌ ఆడాడు. అది కేవలం 4 ఓవర్లకు సంబంధించిన ఫార్మాట్‌... కానీ ఇది సుదీర్ఘ ఫార్మాట్‌ ఇందులో రోజు పడే 90 ఓవర్లలో అతను ఎన్ని ఓవర్లు సమర్థంగా వేయగలడో ఈ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ ద్వారా తెలియనుంది. ఈ వార్మప్‌లో అందరూ భారత ఆటగాళ్లే అయినా మ్యాచ్‌కు ముందరి తుది సన్నాహకం కావడంతో ప్రత్యర్థితో ఆడే పట్టుదలే కనబరుస్తారని జట్టు మేనేజ్‌మెంట్‌ చెబుతోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement