
బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): అంతర్జాతీయ షూటింగ్ క్రీడా సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ప్రపంచకప్ టోర్నమెంట్లో భారత్కు రెండో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ రుద్రాంక్ష్ బాలాసాహెబ్ పాటిల్ పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో మహారాష్ట్రకు చెందిన 21 ఏళ్ల రుద్రాంక్ష్ 252.9 పాయింట్ల స్కోరు చేసి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. మార్టన్ పెనీ (హంగేరి; 251.7 పాయింట్లు) రజతం, జూలియన్ గుటిరెజ్ (అర్జెంటీనా; 230.1 పాయింట్లు) కాంస్యం గెలిచారు. ఫైనల్లో పోటీపడ్డ మరో భారత షూటర్ అర్జున్ బబూటా 144.9 పాయింట్లతో ఏడో స్థానంలో నిలిచాడు.
అంతకుముందు 47 మంది షూటర్లు పోటీపడ్డ క్వాలిఫయింగ్ రౌండ్లో అర్జున్ 643.5 పాయింట్లతో టాప్ ర్యాంక్లో, రుద్రాంక్ష్ 633.7 పాయింట్లతో రెండో ర్యాంక్లో నిలిచి ఫైనల్కు అర్హత సాధించారు. క్వాలిఫయింగ్ రౌండ్లో టాప్–8లో నిలిచిన వారు మాత్రమే ఫైనల్లో పోటీపడతారు. ఇప్పటి వరకు ఈ టోర్నీలో భారత్ రెండు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం గెలిచి నాలుగు పతకాలతో రెండో స్థానంలో ఉంది.
శనివారం జరిగిన మహిళల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్లో సిఫ్ట్ కౌర్ సామ్రా భారత్కు తొలి స్వర్ణ పతకాన్ని అందించింది. ఓవరాల్గా ప్రపంచకప్ టోర్నీల చరిత్రలో రుద్రాంక్ష్ కిది ఐదో పతకం కావడం విశేషం. గతంలో అతను రెండు స్వర్ణాలు (2023 కైరో), రెండు కాంస్యాలు (2023 భోపాల్) సాధించాడు.